30, నవంబర్ 2013, శనివారం

పార్టీ మారిన ఎంపీలను సస్పెండ్ చెయ్యలేదే

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై వేటు వేస్తాం అంటూ బొత్స సత్యనారాయణ గారు చాలా గంభీరంగా ఉపన్యసించారు.   కాంగ్రెస్ బి ఫాం మీద గెలిచి తెరాసతో అంట కాగుతున్న మందా జగన్నాధమ్ మరియు వినోద్ గారిని ఇంతవరకు పార్టీ నుంచి ఎందుకు తొలగించలేదు? ఇటీవలి వరకూ   జగన్ ఆంతరంగికుడిగా పేరుపడ్డ సబ్బం హరిని సస్పెండ్ చేశారా?   నెల క్రితమే మంత్రి పదవికి రాజీనామా చేసి వైకాపా తీర్ధం పుచ్చుకున్న పినిపే విశ్వరూప్ గారిని సస్పెండ్ చేశారా?    రెండు నెలల క్రితం జగన్ పంచన చేరిన ఎంపీ ఎస్పీవై రెడ్డి గారిని పార్టీ నుండి తొలగించేనట్లు ఎక్కడా వార్త రాలేదే?  మీ పార్టీ మొహాన మొగాడిలా రాజీనామా పడేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని మీ పార్టీ లిస్టు నుంచి ఇంకా తొలగించ లేదే.  తెల్లవారింది మొదలు టి వి ఛానల్ వాళ్ళు ఎప్పుడొస్తారు, ముఖ్యమంత్రిని ఎలా తిడదామా అని ఎదురు చూసే ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికలలో గెలవని వృద్ధ జంబూకాల పై ఏమి చర్యలు తీసుకున్నారు?    సికిందరాబాద్ ఎం ఎల్ ఎ జయసుధ గారు జగన్ పక్కన కూర్చొని రైతు దీక్ష, ఫీజు దీక్ష చేసిన ఆవిడ పై చర్యలు తీసుకున్నారా ?   జగన్ జట్టులో ఉన్నప్పుడు కొండా సురేఖ గారు సోనియా గాంధీని బొంద పెట్టాలన్నారు, దుమ్మెత్తి పోశారు.   మళ్ళీ ఆ దంపతులను పార్టీలోకి ఎలా తీసుకున్నారు?   

ఇవన్నీ చూస్తుంటే, దయ్యాలు వేదాలు వల్లించినట్లు లేదూ! 

29, నవంబర్ 2013, శుక్రవారం

"ఆంద్రోళ్ళ అక్రమ ఆస్తులు స్వాధీన పరచుకుంటాం"


గల్లీ నుంచి ధిల్లీ నాయకుడి వరకు రోజుకో ప్రకటన చేసి వార్తల్లో వ్యక్తులుగా వుండాలని భాజపాతో సహా అన్ని పార్టీల నాయకులు తాపత్రయ పడుతున్నారు.   ఆంధ్రా వాళ్ళు అక్రమంగా తెలంగాణలో కాజేసిన భూములను రాబోయే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని ఒక కేంద్ర మంత్రి గారు శెలవిచ్చారు.   ఇది శుభ పరిణామం.    ఇక్కడ ఒక చిన్న సవరణ చేస్తే బాగుంటుంది.   ఆంద్రోళ్ళ అనకుండా, పార్టీలతో, ప్రాంతాలతో  సంబంధం లేకుండా తెలంగాణలో అక్రమాలకు పాల్పడ్డ భూ కబ్జాదారులను ఏరి పారేస్తాం అని చెప్పండి అందరూ హర్షిస్తారు.   దొంగలకు, కబ్జాదారులకు, దోపిడీదారులకు మనలాగా ప్రాంతీయ వైషమ్యాలు వుండవు.   ఆంధ్ర ప్రాంత అక్రమార్కులని అస్సలు వదలకండి.   మీ దగ్గర జైళ్లలో పెట్టుకొని తిండి పెడుతూ మంచి రక్షణ వున్న జైళ్లలో పెట్టండి.   కొత్తగా రాబోయే తెలంగాణా పాలకులు కొంచం పుణ్యం కట్టుకొని, అక్రమాలకు పాల్పడ్డ నాయకులను (ఇరు ప్రాంతాల వారిని) ప్రాసిక్యూట్ చెయ్యండి.  అవశేష తీర సీమంధ్ర ప్రాంతంలో వీళ్ళ పీడ తాత్కాలితంగా విరగడవుతుంది.     కాకపొతే సందట్లో సడేమియా గాళ్ళు ఇలాంటి నాయకుల ప్రకటనలు నమ్మి, గతంలో కొంతమంది చేసిన భాగో జాగో ప్రకటనలతో స్ఫూర్తి పొందిన గల్లీ స్థాయి నాయకులు  ఇతర ప్రాంత ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడకుండా  అదుపు చెయ్యాల్సిన అవసరం వుంది.    మధ్య తరగతి ప్రజలు రెక్కల కష్టంతో కొనుకున్న స్థలాలను, ఇళ్ళను, వారి హక్కులను  రౌడీల బారి నుంచి కాపాడాల్సిన బాధ్యత కొత్తగా రాబోయే ప్రభుత్వానిదే.   విభజనకు పూనుకున్న  కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే ఇతర ప్రాంత ప్రజలకు తెలంగాణలో రక్షణ లేదు కాబట్టి కొన్ని ప్రత్యేక భద్రతలు కల్పించాలి అని చెప్తున్నారు.   ఇది ఒక రకంగా తెలంగాణా నాయకత్వాన్ని అవమాన పరచినట్లే.   దీనికి కారణం గతంలో తెరాస చేసిన రెచ్చగొట్టే ప్రకటనలు, ఉపన్యాసాలు కారణం.  పనిలో పనిగా, ఉద్యమ సమయంలో సినిమా వాళ్ళను, విద్యా, వ్యాపార సంస్థలను బెదిరించి డబ్బులు గుంజుకున్న వాళ్ళ ఆస్థులు కూడా ప్రత్యేక చట్టం ద్వారా జప్తు చెయ్యాలి, లేదంటే నూతనంగా ఏర్పడే స్వచ్చమైన తెలంగాణాకు అర్ధం లేదు.        

23, నవంబర్ 2013, శనివారం

అతి వినయం ధూర్త లక్షణం

అతిగా ఆశ పడే ఆడది, అతిగా ఆవేశ పడే మొగాడు బాగు పడ్డట్లు చరిత్రలో లేదు.   ఈ మాట  నేను చెప్పింది కాదు, మహారాష్ట్రీయుడు, కర్ణాటకలో పుట్టి పెరిగి, తమిళనాడులో 'తలైవర్' గా కీర్తింపబడే రజనీకాంత్ అనబడే శివాజీరావ్ గైక్వాడ్ సినిమా సందేశం. 

సరిగ్గా రేణుకా చౌదరి విషయంలో అదే జరిగింది. గతంలో పొంగులేటి వారికి ఇప్పుడు ఈవిడ గారికి శాస్తి జరిగింది.   పాపం పొంగులేటి వారు ప్రత్యక్ష ఎన్నికల జోలికి పోరు.  ప్రజలతో కన్నా పత్రికా విలేకరులతోనే కాంటాక్ట్స్ ఎక్కువ. రాబోయే రోజులలో పొన్నం వారికి, శంకరన్న గారికి  కూడా టిక్కెట్టు చింపేసే అవకాశం చాలా ఎక్కువ.   కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.   పాపం హనుమంతన్నను చూడండి, ధనియాల్లాగా వాడేశారు.   పార్టీ పెద్దలకు తెలుసు ఎవర్ని ఏ పనికి ఎప్పుడు ఎలా వాడుకోవాలో.    మైకు దొరికితే చాలు పొన్నం గారు నోటికొచ్చినట్లు మాట్లాడుతారు.   గబ్బర్ సింగ్ సినిమాలో కానిస్టేబుల్ అలీ, తన బాస్ చెప్పే వివరాలు నమోదు చేసుకున్నట్లు ఇక్కడా ఒక నమ్మిన బంటు ఆ పని చేస్తుంటాడు.    ఎవరు అతిగా మాట్లాడుతున్నారు, ఎవరు అతి వినయం నటిస్తున్నారు, ఏ ఎంపీ గారు ఎ సి బి కేసులో వుండి రాజకీయాలలోకి వచ్చి కచరా పంచన చేరుదాం అని చూసి అది వీలు పడక  మళ్ళీ అమ్మ ఎవరికైనా అమ్మే అన్నాడు, గుడులు గోపురాలు కట్టిస్తున్నాని వీరంగం ఆడే వాళ్ళు, పగలు విభజన రాత్రి సమైక్యం అనే వాళ్ళెవరు, సందిట్లో సడేమియా లాగా తమకు వాటా ఇవ్వకుండా కాంట్రాక్టులు కొట్టేస్తున్నదేవరు మొదలైన వివరాలు ఎప్పటి కప్పుడు నమోదు చేసుకొని పార్టీ అధినాయకత్వానికి పంపిస్తారు.     మధు యాష్కీ గారు చూడండి, పార్లమెంటు మెట్ల మీద మూడు నిద్దర్లు చేసిన వాళ్ళలో లేడు,కాబట్టే పదవి ఇచ్చారు.    గతంలో కిరణ్ సారు కూడా చాలా నెమ్మదిగా వుండేవారు, అందుకే పదవి వరించింది.   తీర ప్రాంత కేంద్ర మంత్రులు ఏమ్పీలలో  దాదాపు సగం మంది కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలే.   ఏవో లొసుగులు లేకుండా వుంటయ్యా చెప్పండి. వాళ్ళే మాకు కావాలి ఎందుకంటే కుక్కిన పేనుల్లా పడివుంటారు.  తోక ఝాడిస్తున్న లగడపాటికి కూడా తిప్పలు తప్పవు. 

కాబట్టి, కొంచం ఆవేశాన్ని, ఆశల్ని తగ్గించుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఎక్స్పైరీ డేట్ ఉండని మందులు డా॥ సోనియా రాసిస్తారు.   లేదంటే మీ ఇష్టం.      


16, నవంబర్ 2013, శనివారం

శాసన సభలో బిల్లు ఆమోదం పొందడం ఖాయం


ఆంధ్రప్రదేశ్ శాసన సభలో తెలంగాణా బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లు స్వల్ప ఆధిక్యంతో నెగ్గే అవకాశం లేకపోలేదు.   కాంగ్రెస్ పార్టీ ఈ పాటికే దానికి తగిన తాయిలాలు ఏర్పాట్లు చేసి ఉండచ్చు.   కిరణ్ కుమార్ వ్యతిరేక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ దువ్వుతుంది.  ఎవరైతే బిల్లుకు మద్దతు ఇస్తారో వాళ్ళందరిని కొత్త రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పెద్ద పదవులు ఖాయం అని చెప్తారు.    శాసన సభ ఆమోదంతో  సంబంధం లేకుండా బిల్లు పార్లమెంటుకు వెళుతుంది అక్కడ భాజపా మద్దతిస్తే గెలుస్తుంది.    ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేసినా, అనుకూలంగా ఓటు చేసినా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై తీర సీమాంధ్ర ప్రాంతంలో గెలవడం కష్టం.  ఓటరు జ్ఞాపక శక్తి చాలా తక్కువ.   2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం లేకపోలేదు.   కాబట్టి, ఎలానూ గెలవని కాడికి కాంగ్రెస్ అధిష్టానంతో గొడవ ఎందుకు ఎంచక్కా ఒక జాతీయ పార్టీతో వుంటే ఐదు లేక 10 సంవత్సరాలలో ఒక స్థాయికి రావచ్చు అని భావించే వాళ్ళు కనీసం 30 మంది శాసన సభ్యులు తీర సీమంధ్రలో వున్నారు.   చంద్ర బాబు నాయుడు ఓటింగ్ సమయంలో వాకౌట్ చెయ్యచ్చు.     కొంత మంది శాసన సభ్యుల రాజీనామాలు సభాపతి దగ్గర పెండింగ్లో వున్నాయి.   వాటిని ఆయన ఆమోదిస్తే, మార్గం ఇంకా సులువవుతుంది.     వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే ఆంధ్ర ప్రదేశ్ లో రోహిణీ కార్తె  కార్తీక మాసం లోనే వచ్చే ప్రమాదం లేకపోలేదు.  

14, నవంబర్ 2013, గురువారం

హైదరాబాదు రియల్ ఎస్టేట్ ధరలకు ఢోకా వుండదు


చాలా మంది మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వ్యక్తులు హైదరాబాదు మన రాష్ట్ర రాజధాని, మహా నగరం, ఇక్కడ ఉపాధి దొరుకుతుంది  అన్న దృష్టితో పెట్టుబడి పెట్టి ఇండ్ల స్థలాలు, ఫ్లాట్స్ కొనుగోలుచేశారు.  గత మూడు సంవత్సరాల నుండి కొన్ని అసాంఘీక శక్తులు పెట్రేగిపోయి రాష్ట్రం విడిపోగానే వాళ్ళ ఇండ్లు, స్థలాలు మేము లాక్కొని మీకు  దగ్గరుండి ఇప్పిస్తాం అని ప్రచారం చేశారు.   కొంతమంది అమాయకులు ఆ మాటలు విని మోసపోయారు.   ఇటీవల నేను కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడాను.   తెలంగాణాకు చెందిన వారి సహచర ఉద్యోగులు (అందరూ కాదు కొద్ది మంది మాత్రమె)తీర సీమాంధ్ర ఉద్యోగులని కూడా తమ ఇళ్ళు ఎప్పుడు తక్కువ ధరకు అమ్మి వెళ్ళిపోతున్నారని పరిహాస మాడుతున్నారట !   ఈ భయాలకు తోడు ప్రతి రాజకీయ గుండా టి వి గొట్టం నోట్లో పెట్టుకొని రేచ్చిపోతూ "సెటిలర్లను మేం పొట్టలో పెట్టుకుంటాం, మేం వాళ్ళని కొట్టం తిట్టం" అని అత్యంత ఆప్యాయంగా బెదిరిస్తుంటారు.  


తీర సీమాన్ధ్రులు ఎన్నుకున్న  కొంత మంది కోటీశ్వరులైన  ఎం పీ,  ఎం ఎల్ ఏ లు తమ ఆదాయంతో ఒంగోలు, గుంటూరు, విశాఖ ప్రాంతాలలో గతంలోనే వేల ఎకరాలు భూములు చౌకగా కొట్టేశారు.   రాబోయే రాజధాని, దాని పక్కనే సముద్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఎస్ ఈ జెడ్, ఐ టి పార్క్    అనే పేరుతో  ప్లాట్లు చేసి  ఎక్కడ లేని రేట్లకు అమ్మేశారు.   మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలు తమ కష్టార్జితాన్ని ఈ మూడు ప్రాంతాలలో ధారపోశారు.   రాజకీయ నాయకుల ముసుగులో వున్న రియల్ వ్యాపారులు,  కొన్ని వార్తా సంస్థలకు డబ్బులిచ్చి మరీ రాబోయే రాజధాని కొలతలు, విమానాలు ఎగురుతున్న బొమ్మలు చూపించారు.    ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోని ఒంగోలులో ఊరికి దూరంగా గజం 20,000 ఉందంటే నమ్మండి.   గుంటూరు-విజయవాడ మధ్యలో స్థలాలు అంత రేటు లేకపోయినా, అక్కడి రియల్  ఎస్టేట్ మాఫియా అరిచేతిలో తెనేపోసి మోచెయ్యి దాకా నాకిస్తుంది.   రోజుకు సగటున ఎంతమంది విమాన ప్రయాణం చేస్తున్నారు?  అదేమన్నా కార్మికులకు పెద్ద స్థాయిలో ఉపాధి కల్పించే పరిశ్రమా?  సామాన్యుడికి కావాల్సింది తొందరగా, తక్కువ ఖర్చులో గమ్యం చేరడం.   పరిశ్రమల పేరిట   ఎస్ ఈ జెడ్ ల భూములు భోంచేసి వ్యవసాయ అర్హమైన భూమిని లేకుండా చేశారు.   భూముల కొరత వలన సామాన్య రైతు ఎకరం భూమి సొంతం చేసుకోవాలంటే కనీసం 6-7 లక్షలు కావాల్సిన పరిస్థితి. 


ఇలాంటి పరిస్థితులలో తీర ప్రాంతంలో భూములు కొనడం కన్నా పూర్తిగా అభివృద్ధి చెందిన హైదరాబాదులో పెట్టుబడి  పెట్టడం సరైంది.   ప్రపంచీకరణ నేపధ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ.   జీతాలు మరీ తక్కువ.   ప్రైవేటు రంగంలో పెట్టుబడి పెట్టిన విదేశీ కంపెనీలు, తెలంగాణా పెట్టుబడిదారుల కంపెనీలు, మార్వాడీ కంపెనీలు లేదా తీర సీమంధ్ర పెట్టుబడులు పెట్టిన కంపెనీలైనా వారు జీతమిచ్చి పెట్టుకొనే ఉద్యోగులుని ప్రాంతాలతో సంబంధం లేకుండా నైపుణ్యం ఉన్నవారినే తీసుకుంటారు తప్ప, ఇక్కడున్న కంపెనీలలో తెలంగాణా వారిని మాత్రమే తీసుకోవాలి, సోరకాయని చూపించి దీనిని ఆనప కాయ అంటారా అనే ఇంటర్వ్యు చేసి ఉద్యోగం ఇవ్వాలంటే, ఏ పెట్టుబడి దారుడు హైదరాబాదుకు రాడు.   కాకపోతే, మధ్య మధ్యలో శివసేన లాంటి కొన్ని గ్రూపులు తెలంగాణలో కూడా తయారవుతాయి.    ఏ పెట్టుబడిదారుడైనా ఇలాంటి వారికోసం సంవత్సరానికి 'ఇంత' అని ముట్ట చెప్పాల్సిందే.   దేశ వ్యాప్తంగా జరిగే తంతు ఇదే.


హైదరాబాదులో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి తరుణం.   రాజధాని కోసం కొత్తగా బిల్డింగులు, ఐ ఐ ఎం, ఐ ఐ టి వచ్చినంత మాత్రాన సామాన్యుడికి  తీరప్రాంతంలో ఉపాధి దొరకదు.   ఈ భవంతులు కట్టినంత కాలం ఇటుకలు మోయడానికి, తాపీ పని చేసే వారికి, వారిని నియోగించుకొనే లగడపాటి, రాయపాటి,  బోయపాటి, కామినేని, నన్నపనేని, రామినేని దగ్గుపాటి, కావూరి మొ॥ వారికి తప్ప ఎవరికీ ఉపయోగం లేదు. ఒంగోలు, గుంటూరు, విశాఖలలో భూములు కొనే డబ్బులో సగం డబ్బుతో ఇక్కుడ అన్ని వసతులు వున్న ఇండ్లు కొనుగోలు చెయ్యవచ్చు.  ప్రభుత్వ ఉద్యోగాలలో ఆరక్షణ ఉండక పోవచ్చు కానీ, ప్రైవేటు ఉద్యోగాలకు భవిష్యత్లో కొదవ వుండదు.    


ప్రత్యేక రాష్ట్రం వేర్పడ్డ తరువాత, తీర ప్రాంతంలో ఇండ్ల స్థలాలు కోన లేక మళ్ళీ హైదరాబాదుకు  తిరిగి  రావడం ఖాయం.  

12, నవంబర్ 2013, మంగళవారం

యూ టి చెయ్యాలనే వారు తెలుగు జాతి ద్రోహులు


కొత్త బిచ్చగాడు పొద్దెరగడని సామెత.   బహుశా మన చిరు జీవి లాంటి వారు రాజకీయాలలోకి వస్తారని ముందే ఊహించి ఈ సామెత పుట్టిందేమో!

హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే, ప్రస్తుతం వస్తున్న ఆదాయం మొత్తం కేంద్రానికి చెందుతుంది.   అప్పుడు నిధుల కోసం ఇరు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు చెరో బొచ్చ తీసుకొని ధిల్లీ వీధులపాలు అవ్వాల్సి వస్తుంది. ప్రస్తుత రాష్ట్ర ఆదాయంలో 50 శాతానికి పైగా ఆదాయం హైదరాబాదు నుంచే వస్తున్నది.   అట్లాంటి ప్రాంతాన్ని కేంద్రం పాదాల వద్ద తాకట్టు పెట్టి ఎవరూ బావుకొనేదేమీ వుండదు.  రాష్ట్రం విడిపోతే రైతులు , ఉద్యోగస్తులు నష్టపోతారు అని చెప్పే నాయకులు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఈ నష్టాలు ఎలా పూడతాయి.    

పంతాలకు పట్టింపులకు పోకుండా, ఒక పెద్ద సమస్యకు చిత్తశుద్ధితో  తెలంగాణా నాయకులు పరిష్కారం కనుగొనదలచుకుంటే భద్రాచలం, మునగాల లాంటి ఆంద్ర ప్రాంతానికి చెందిన గ్రామాలను వదులుకొని, కొంత కాలం పాటు హైదరాబాద్ ఆదాయాన్ని పంచుకోవడం, ఉద్యోగస్తులకు వారు ఎక్కడ ఉండాలో తేల్చుకొనే అధికారం వారికే ఇస్తూ సామరస్య పూరక వాతావరణం కల్పించాలి.    సీమాన్ద్రులకు మేము రక్షణ కల్పిస్తాం అంటూ భయపెట్టే వాళ్ళను తక్షణం బెయులు రాని కేసులు పెడితే సగం గొడవ సద్దుమణుగుతుంది.   ఎక్కువ మంది సీమ ప్రజా ప్రతినిధులు కోరుకుంటున్నట్లు రాయల తెలంగాణా చేసి తెలంగాణా ప్రజలను ఒప్పించగలిగితే, ఈ సమస్యకు శాశ్వత మరియు సామరస్య పూర్వకమైన పరిష్కారం లభించ వచ్చు.        

కోల్ స్కామ్ నుంచి రక్షణ కోసమే తెలంగాణా బిల్లు



ఇటీవలి కోల్ కుంభకోణం దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.   చివరికి ఈ ఆరోపణల వలన  ప్రధాన మంత్రి కూడా  ఇబ్బంది పడ్డారు.    శీతాకాల పార్లమెంటు సమావేశాలలో వాస్తవానికి ప్రతిపక్షాలది ఇదే ప్రధాన అజెండా.   కేవలం 12 పనిదినాలు మాత్రమే జరిగే ఈ సమావేశాలలో ఎన్నో ముఖ్యమైన ఆర్ధిక, సామాజిక, రాజకీయ అంశాలు (తెలంగాణా బిల్లుతో సహా) సభ ముందుకు వచ్చే అవకాశం వుంది.   అలాంటి సందర్భంలో, ప్రధాన ప్రతిపక్షం బొగ్గు కుంభకోణానికి ప్రధమ ప్రాధాన్యాన్నిచ్చి తెలంగాణా బిల్లును రెండవ అంశంగా చేపడితే, రాష్ట్ర విభజనకు భాజపా సుముఖంగా లేదు అని ప్రచారం చేసే అవకాశం వుంది.   ఈ అపవాదు నుంచి తప్పించుకోవడానికి భాజపా తెలంగాణా అంశంపై చర్చిస్తే, పుణ్యకాలం పూర్తయి సార్వత్రిక ఎన్నికల ముందు బొగ్గుమసి నుంచి తప్పించుకోవచ్చు.  ఒక వేళ పార్లమెంటులో తెలంగాణా బిల్లు పెట్టినా, ఆమోదం పొందినా, బిల్లు  పెట్టకపోయినా లేక దాని మీద చర్చ జరగకపోయినా కాంగ్రెస్కు లాభం.   ఒకవేళ బిల్లు చర్చకు రాకపోతే,   తీర సీమాన్ద్రులు తమ ప్రతినిధులుగా ఎన్నుకున్న  కాంట్రాక్టర్లు రాయపాటి, బోయపాటి, లగడపాటి, కావూరి మొ॥ జనం మధ్యలోకి వెళ్లి తాము ఎంత వీరోచితంగా పోరాడి తెలంగాణా బిల్లును అడ్డుకున్నామో, తమబోటి వారిని మళ్ళీ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తారు.   ప్రజలు ఈలలు వేసి చప్పట్లు కొడతారు. మళ్ళీ ఐదు సంవత్సరాల కోసం వారే గెలుస్తారు.   బిల్లు ఆమోదం పొందితే, అమ్మ దయ.   మీరు మాకు వోట్లు వెయ్యాల్సిందే అని కరాఖండిగా తెలంగాణలో చెప్పచ్చు.   లేదంటే, చూశారా అమ్మ ఎంతో ముచ్చటపడి ఆనంద భాష్పాలతో తడిపి మరీ బిల్లు పెడితే భాజపా వారు అడ్డుతగిలారు.   ఆ పార్టీ అన్ద్రోల్లతో కలిసి మనలని మోసం చేసింది.   వాళ్ళు ప్రచారానికొస్తే అడ్డుకోండి, తరిమి తరిమి కొట్టండి, దిమ్మెలు కూల్చండి  అని చెప్పవచ్చు.    ఈ విభేదాలు ఇలానే కొనసాగుతూ వైషమ్యాలు తీవ్ర రూపం దాల్చే ప్రమాదం వుంది.    ఇది పసిగట్టే, శ్రీవారు చాలా స్పష్టంగా రాష్ట్రాన్ని డి మెర్జర్ చేసినా మేము మాత్రం మెర్జ్ కాము, పొత్తు ప్రసక్తే లేదని తేల్చేశారు.   ఎవరిపాటికి వారు విడివిడిగా పోటీ చేసే విషయం ముందు తెలిసుంటే కాంగ్రెస్ విభజన ఊబి లోకి పాపం దిగేదే కాదు. 


రాజకీయ నాయకులు ప్రజల యొక్క తెలివి తేటలు, విజ్ఞత మొదలైన విషయాలను  వారి ఉపన్యాసాలలో తరచూ చొప్పిస్తుంటారు.  కానీ వారికీ తెలుసు, ప్రజల జ్ఞాపక శక్తి ఆయుష్షు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అని.   రాజకీయ నాయకులు చెప్పేదే నిజమైతే, ఎమర్జన్సీ తరువాత కాంగ్రెస్ పార్టీ రాజకీయాల నుండి అంతర్ధానమై వుండేది. అండర్ వరల్డ్ డాన్ అరుణ్ గావ్లీ మహారాష్ట్ర శాసన సభకు ఎన్నికై వుండే వాడు కాదు.      ప్రజల జ్ఞాపక శక్తి అంత ఎక్కువైతే, చాలా మంది  రాజకీయ నాయకులు  రెండో సారి ఎన్నికయ్యే వారు  కాదు.            

తెరాసను జాతీయ పార్టీగా చూడాలని వుంది


తెలంగాణా రాష్ట్ర సమితిని కేవలం ఉప ప్రాంతీయ పార్టీగా పరిగణిస్తూ గేలి చేస్తున్నవారికి హెచ్చరికలా ఆ పార్టీ 2014లో జాతీయ పార్టీ అయ్యే అవకాశం  వుంది.    భద్రాద్రి రాములోరి దయవలన ఖమ్మం జిల్లాలోని కొంత ప్రాంతం, ఆలంపూరు శివుడి దయవలన మహబూబ్ నగర్లోని కొన్ని మండలాలు మరియు సొనియమ్మ దయవలన నల్లగొండ జిల్లాలోని మునగాల పరగణాలు తీర సీమాన్ధ్ర రాష్ట్రంలో కలిసే అవకాశం వుంది.   ఈ ప్రాంతాలన్నీ 1956 సమైక్యానికి పూర్వం ఆంధ్రాలోవే.   ఇరు ప్రాంతాలలోని  తెలుగు వాళ్ళకు సి డబ్ల్యు సి వాక్కు బైబిల్ తో సమానం.   గతంలో తెరాసా వారు కాంగిరేసు వాళ్ళు  కూడా  మెర్జర్ - డి మెర్జర్, మాకు ఆంధ్రా ప్రాంతం నుంచి సూది మొన మోపే అంత భూ భాగం కూడా వద్దన్నారు.   మనందరికీ తెలుసు తెరాసా అన్నా కచరా అన్నా మాటకోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిత్వం.  తెలంగాణా కాంగ్రెస్ వారికి అమ్మ మాట వేద వాక్కు.   కాబట్టి, విభజన జరిగినంత మాత్రాన, వైఎసార్ పార్టీ తెలంగాణా లో బోర్డు తీసేస్తుందా, భద్రాచలం, మునగాల మరియు గద్వాల ప్రాంతంలో తెరాసా ఉనికి కోల్పోతుందా!   భవిష్యత్లో రాయలసీమ విడిపోవడం ఖాయం.   ఆ దిశగా ఇప్పటికే బైరెడ్డి గారు బండ బూతులు కూడా నేర్చుకున్నారు. మూడో రాష్ట్రం కూడా కార్య రూపం దాల్చితే, తెదేపా, వై ఎస్ ఆర్ సి పి, తెరాస జాతీయ పార్టీలుగా ఆవిర్భవించే అవకాశం వుంది.  ఏం తెలుగు మాట్లాడే వారికి మూడు రాష్ట్రాలు మూడు జాతీయ పార్టీలు వుంటే తప్పేంటి?



                  

4, నవంబర్ 2013, సోమవారం

సమన్యాయం పేరిట పిచ్చెకిస్తున్న చంద్ర బాబు


2009 డిసెంబర్  నెలలో కె సి ఆర్ దీక్ష సందర్భంగా బాబు గారు రెచ్చిపోయి మీరు తీర్మానం చెయ్యండి ఒక సంతకం పెట్టేస్తా అని బావమరిది బాలకృష్ణ గారిలా తొడలు కొట్టి సవాలు చేశాడు.  పాపం ఆయన ముచ్చట కాదన లేక రోశయ్య గారు దగ్గరుండి సంతకం పెట్టించారు.      ఆ, వీళ్ళు నిజంగా విభజిస్తారా అన్న ఒక అపోహ.   అప్పుడు మొదలైన ఆయన తప్పటడుగులు ఇంకా కొనసాగుతూనే వున్నాయి.         జూలై 30 తరువాత మొదలైన ఆయన సమన్యాయం ఇంతవరకు ఎవరికీ అర్ధం కాలేదు. 


మా పోలిట్ బ్యూరో ఇచ్చిన ఉత్తరానికి కట్టుబడి ఉన్నాము.   కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అర్ధరహిత నిర్ణయం సరికాదు అంటాడు.   మరి అర్ధవంతంగా ఎలా విభజించాలి చెప్పండి బాబూ అంటే, తీర్పు ఇచ్చిన తరువాత విచారణ జరపడం ఏమిటీ అంటాడు.   ఒక వేళ శాసన సభలో తీర్మానం వస్తే, మీరు అనుకూలంగా వోటు వేస్తారా లేక వ్యతిరేకంగానా అంటే, కాంగ్రెస్ పార్టీ కేవలం రాహుల్ గాంధీని ప్రధానిని చెయ్యడానికి తీసుకున్న నిర్ణయం ఇది అంటాడు.   మరి కాంగ్రెస్ పార్టీపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు ఓడించలేదు అంటే, బెయిల్ కోసం, పాకేజీల కోసం మేము వేరేవరినో ఎందుకు సపోర్టు చెయ్యాలి అంటాడు (అప్పటికి తమ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా లేదన్నది బహిరంగ రహస్యం).  పోనీ, సమన్యాయం అంటే ఏమి చెయ్యాలి అంటే, కాంగ్రెస్- తెరాసా - వైకాపా కలిసిపోయి తెదేపాను అంతం చేసే కుట్ర ఇది అంటాడు.    పోనీ మంత్రుల బృందాన్ని కలిసి ఎలా చేస్తే బాగుంటుందో చెప్పమంటే - నన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చెయ్యండి, ఆరు నెలలో ఈ సమస్యను పరిష్కరిస్తాను అంటాడు.    మీరు 2009లో టి ఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు కదా అంటే, ఆ రోజు కె సి ఆర్ కు మంత్రి పదవి ఇస్తే, ఇవ్వాళ ఆ పార్టీ పుట్టివుండేది కాదు అంటాడు.    మీరు విభజనకు అనుకూలం కదా అంటే, మా తొమ్మిదేళ్ళ పరిపాలనలో బిల్లుగెట్, బిల్లు క్లింటన్లు వచ్చారు.  బ్రహ్మాండమైన రోడ్లు, సైబరాబాద్ నిర్మాణం, బిందు సేద్యం, తుంపర సేద్యం, ఇ-సేవ  లాంటి ఎన్నో కార్యక్రమాలతో ముందుకుపోయం అంటాడు.    


బాబు గారూ - మీరు కొంత కాలం కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా వున్నారు.    కాంగ్రెస్ పార్టీలో రాజకీయ మేధావులకు కొదవ లేదు.   నాలుగు దశాబ్దాల మీ రాజకీయ జీవితంలో కాంగ్రెస్ నుంచి మీరు ఏమీ తెలుసుకోలేదంటే, మీ మేధాశక్తిని శంకించాల్సి వస్తుంది.    పొంతన లేని సమాధానాలతో ప్రజలని పిచ్చెక్కిస్తున్నారు.    జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపా కేవలం తెలంగాణలో మాత్రమె తమ ఉనికిని చాటుకోవడాని నిర్ణయించుకున్నాయి.  మీ హృదయం నిండా సమైక్యం నిండి వున్నదని సగటు తీర సీమంధ్ర ఓటరుకు తెలుసు.   కానీ మీరు మాత్రం  ఇరు ప్రాంతాలలో బ్రతికి బట్టకట్టాలని ప్రయత్నిస్తున్నారు.   కేవలం కొన్ని సీట్ల కోసం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ టి ఆర్ ఆశయాలను తుంగలో తొక్కి సమైక్యంపై రాజీ పడ్డారు.    ఈ ప్రయత్నంలో రెండు ప్రాంతాలలో బ్రష్టు పట్టి, మీ రాజకీయ జీవితానికి శుభం కార్డు పడే ప్రమాదం వుంది, తస్మాత్ జాగ్రత్త.   మీ మేధస్సు, పరిపాలనా నైపుణ్యం, రాజకీయ చాణుక్యం తీర సీమాంధ్ర పునర్నిర్మాణంలో  మీ అవసరం ఎంతో వుంది. మీరు ఇప్పటికైనా రెండు పడవలలో కాళ్ళు పెట్టడం తక్షణం మానేసి తీర సీమాన్ధ్రలో మాత్రమె వుండాలని విజ్యప్తి.   2014 లో అధికారంలోకి రాకపోయినా కనీసం 2019లో మీరు తప్పక వస్తారు.    

3, నవంబర్ 2013, ఆదివారం

వెల వెల పోయిన దీపావళి


బెంగలూరు నగరం భిన్న భాషలకు, సంస్కృతులకు నిలయం.  నేను గత పది సంవత్సరాలుగా దీపావళిని ఇక్కడే జరుపుకుంటున్నాను.    కనీసం మూడు రోజులపాటు భయంకరమైన శబ్దాలతో జరుపుకునే ఈ పండుగ ఈ సారి ప్రతి సంవత్సరం వినిపించే శబ్దాలలో కనీసం 50 శాతం కూడా చప్పుడు లేదు.   దీనికి మూడు ప్రధాన కారణాలు - పెరిగిన ధరలు, సమయానికి అందని జీతాలు మరియు కాలుష్యంపై పెరిగిన అవగాహన.    


కొన్నైనా దీపావళి బాణ సంచా కొందామని మార్కెట్కు వెళితే, ఒక పాకెట్ విడి క్రాకర్స్ ధర 215/- చెప్పాడు.   అప్పుడు అర్ధమైంది నగరంలో శబ్ద కాలుష్యం  ఎందుకు తగ్గిందా అని.    బెంగళూరులో చెట్లు ఎక్కువగా వుండటం, పార్థీనియమ్ (కాంగ్రెస్ గ్రాస్ - ఇక్కడ కూడా ఆ పేరు తలనొప్పే), సముద్ర మట్టానికి సుమారు 800 మీటర్ల ఎత్తులో వుండటం, వాయు కాలుష్యం మొదలైన వాటి వలన ఇక్కడ రక రకాల అలర్జీలతో, ఆస్థమాతొ బాధపడే వాళ్ళు ఎక్కువ.   దీపావళి టపాకాయల పుణ్యమా అని గాలిలో గంధకం శాతం ఎక్కువ కావడం మరియు వ్యర్ధ పదార్ధాలు ఎక్కువగా కలవడం వలన అలర్జీతో బాధ పడేవారికి ఈ వారం రోజులు నరకం.   


వీటన్నిటి దృష్ట్యా బాణసంచా ఎంత తక్కువ వినియోగిస్తే అంత వాతావరణ కాలుష్యాన్ని తగ్గించిన వారమౌతాం. తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.    

2, నవంబర్ 2013, శనివారం

సమైక్య రాష్ట్ర ఎన్నికలలో తెదేపా ను ఓడించండి


విభజన అనివార్యం అని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు భావిస్తున్నారన్నది నిర్వివాదాంశం.   బిల్లు శీతాకాల సమావేశాలలో పార్లమెంటులో ప్రవేశ పెట్టే సమయానికి న్యాయస్థానాల తీర్పులు, రాజకీయ మార్పులు సంభవిస్తే విభజన ప్రక్రియ ఎన్నికల తరువాత కేంద్ర, రాష్ట్రాలలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం తీసుకొనే నిర్ణయంపై ఆధారపడి వుంటుంది.    


సమైక్య రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన సందర్భంలో, తెదేపా అధికారంలో వస్తే, మరలా 5 సంవత్సరాలపాటు అనిశ్చితి ఇలానే కొనసాగే ప్రమాదం వుంది.   తెలంగాణా తెదేపా నాయకులు శాసనసభలో బిల్లు పెట్టమని ఒత్తిడి తెచ్చే ప్రమాదం వుంది.  మళ్ళీ ఉద్యమాలు, ఆత్మ బలిదానాలు వగైరా వగైరా. కావున  ఈ ఊసరవెల్లి కన్నా, అవినీతి ఆరోపణలలో కూరుకుపోయిన జగనే బెటర్.   తను ఎట్లైనా సమైక్యవాది కాబట్టి ఆయన ఏలుబడిలో ఈ సమస్య ఉత్పన్నం కాదు.    జగన్ అధికారంలోకి వస్తే, తెలంగాణాలోని ఆయన సామాజిక వర్గ ఎంఎల్ఎ లు ఆయన పంచన తిరిగి చేరే అవకాశం వుంది. దీనితో కొంత సుస్తిరత రావచ్చు.   సమైక్య రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే, ఆత్మను చంపుకొని, దేశంలోనే అత్యంత పెద్ద అవినీతి పరుడుగా గుర్తింపు పొందిన జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించ ప్రార్ధన.