25, జూన్ 2014, బుధవారం

ఆంధ్రా కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి


అయ్యలారా, 

ఇటీవలి ఎన్నికలలో మీరు ఘోర పరాజయం పొందిన పిమ్మట మీరందరూ కలసి కూర్చొని ఓటమికి గల కారణాలు విశ్లేషించారు.   ఇది ఒక రకంగా సంతాప సభలా జరిగింది.   ఇందులో వచ్చిన కొన్ని సూచనలలో ముఖ్యమైనవి అ) పార్టీకి ఒక టి వి మరియు పత్రిక కావాలని ఆ) పార్టీ అధ్యక్షురాలు మరియు యువ నేత ఆంధ్రాలో తరచూ పర్యటించాలని -- 


నిజంగా మీరు పార్టీ శ్రేయస్సు కోరుకొనే నాయకులైతే దయచేసి ఈ రెండు పనులు మాత్రం చెయ్యవద్దు.  పొరపాటున ప్రజలు మీ చానల్లో సోనియా గాంధీ బొమ్మ చూసారంటే,  వాళ్లకు గతంలో తెలుగు వారిని చీల్చి చెండాడుతూ  ఆమె జరిపిన దాడి (యుద్ధ విమానంలో బిల్లు పంపడం, పార్లమెంటులో దీపాలార్పడం) వగైరాలు గుర్తు వచ్చి మానుతున్న గాయాన్ని మళ్ళీ గెలికింది మీరే అని మిమ్మల్ని ఇంకా ఘోరంగా శిక్షించే  ప్రమాదం వుంది.   


పోనీ పాపం మీరు పత్రిక పెడితే, ఎవరిని విమర్శిస్తారు -- తెదేపాను విమర్శిస్తే, జగన్ బలం పెరుగుతుంది, జగన్ను విమర్శిస్తే తెదేపా బలం పెరుగుతుంది.   మిమ్మల్ని మీరు పోగుడుకునే దానికి అక్కడ ముడి సరుకు లేదు. కాబట్టి పరిస్తితులు కొంత అనుకూలించే వరకు పొరపాటున కూడా ఆ పని చెయ్యవద్దు.   


ఎన్నికల సమయంలో మీకు చేతై నంత వరకు మీరే ప్రచారం చేసుకోండి గానీ పొరపాటున కూడా ధిల్లీ నుంచి ఎవరినీ పిలవవద్దు.  సినిమా పిచ్చి కాస్త ఎక్కువగా వున్న ఆంధ్ర ప్రజలు కూడా చిరంజీవిని తిలకించడానికి ఇక ముందు సభలకు రారు.  కనీసం మీ అంతట మీరు ప్రచారం చేసుకుంటే, ఇద్దరికో మహా అయితే పది మందికో ధరావతు దక్కే అదృష్టం వుంది.   పై నుంచి మీ నాయకులు తరచూ వస్తే అది కూడా కష్టమే.   ఒక పది సంవత్సరాలు ఓపిక పట్టండి, ఒకటో ఆరో సీట్లు రాక మానవు.  


ఇప్పటికీ ఏదో ఒక మూల కాంగ్రెస్పై కాస్తో కూస్తో అభిమానమున్న వాడిగా సిగ్గుతో ఈ సలహా ఇస్తున్నాను, తప్పక పాటించ గలరు.  

23, జూన్ 2014, సోమవారం

ఎవరు స్థానికులు?


వైద్య, తాంత్రిక మరియు వృత్తి విద్యా కళాశాలల్లో ప్రవేశాలకు దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలు దాదాపు ఒకే విధానాన్ని పాటిస్తున్నాయి.    తమిళనాడులో 8 నుంచి 12వ తరగతి వరకు ఆ రాష్ట్రంలో చదువుకున్న ఏ విద్యార్ధైనా అక్కడి కాలేజీల్లో  స్తానికుడిగా గుర్తింపబడతాడు.     కర్ణాటకలో 1 నుండి 12 వ తరగతి లోపల ఏడు సంవత్సరాలపాటు (పి యు సి తప్పకుండా  కర్ణాటకలోనే చదవాలి) చదివితే వారు స్థానికులుగా గుర్తింపు పొందుతారు.   ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జోనల్ సిస్టం ప్రకారం ఉండేది.    అందులోను స్థానికతను ఆనప కాయ-సొర కాయ, గోంగూర-కుంటికూర గుర్తింపులతో కాకుండా ఎక్కడ చదువుకున్నారనే వాస్తవాన్ని బట్టే ప్రవేశం వుండేది.


చిక్కల్లా, ప్రియతమ నాయకుడు దివంగత మేత ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్సుమెంటు పధకం వల్లనే వచ్చింది.   తెలంగాణాలోని ఇంజనీరింగు కాలేజీలలో మాత్రం 5-7 సంవత్సరాల స్థానికత ప్రకారం విద్యార్ధులు చేరవచ్చు. కానీ, ఫీజు రియంబర్సుమెంటు విషయంలో విద్యార్ధి తండ్రి తెలంగాణలో పుట్టి వుంటేనే ఈ సదుపాయం దక్కబోతోందని సమాచారం.   కాలేజీలో ప్రవేశానికి కూడా ఈ నిబంధన పెట్టినట్లయితే, సగానికి పైగా ఇంగాజీరింగు కళాశాలలు మూత పడతాయి.       


చట్ట సభలలో ఎంపీలుగా ఎం ఎల్ ఏ లు గా ఎన్నిక కాబడడానికి స్థానికత, వాళ్ళ నాన్న, తాత ఎక్కడ పుట్టింది అవసరం లేదు కానీ,  ఫీజు రియంబర్సుమెంటుకు మాత్రం కావాలి.    మరాఠీ, ఒరియా, కన్నడ మాతృభాషగా కలిగిన వ్యక్తులు 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్న వ్యక్తులు కూడా మన రాష్ట్రం నుండి శాసన సభకు గెలవ వచ్చు.   ఈ దేశంలో పుట్టని, ఈ దేశంతో సంబంధం లేని వారు కూడా ఈ దేశాన్ని వెనుక వుండి పరిపాలించ వచ్చు.


ప్రకాశం జిల్లాలో పుట్టి పెరిగిన పుల్లెల గోపీ చందు గారు తెలంగాణా బాడ్మింటన్ అసోసియేషన్కు నిన్ననే కార్యదర్శిగా ఎన్నికయ్యారు.   మరి వారి స్థానికతకు కొలబద్ద ఏమిటో!   

గత మూడు సంవత్సరాలనుండి ప్రజల మనోభావాలను రెచ్చగొట్టిన వారు ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని దిగ్విజయమైన బందుతో మొదలు పెట్టి  అదే రెచ్చగొట్టే విధానాల ద్వారా ఐదు సంవత్సరాలు పబ్బం గడుపుకోవాలనుకోవడం శోచనీయం.  


మోటార్ వాహనాన్ని అమ్మేపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు


ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం మా కంపెనీ సలహా మీద కొన్ని మోటార్ బైకులు షోరూం వాళ్లకి ఇచ్చి కొత్త వాహనాలు తీసుకున్నాము.   ప్రతి షోరూంకు అనుబంధంగా కొంత మంది ఏజెంట్స్ వుంటారు.  మన పాత వాహనం వాళ్ళు తీసుకొని షో రూం వాడికి డబ్బు ఇస్తారు.    షోరూం వాడు మన దగ్గర ధరలో వ్యత్యాసాన్ని తీసుకొని మనకు కొత్త వాహనం ఇస్తాడు.     ఈ మొత్తం వ్యవహారం మనకి కొత్త వాహనం వచ్చిన సరదాలో మర్చిపోతాం.   

ఇటీవలే మా ఆఫీసుకు కోర్టు నుండి 'సమన్స్' వచ్చాయి.    దాని సారాంశం -- మీ పేరిట వున్న వాహనం ఒక రోడ్డు ప్రమాదంలో వుందని, ఎవరికైతే మీ వాహనం వలన గాయాలు తగిలాయో వారు మీ మీద మూడు లక్షలకు నష్ట పరిహారం వేసారని --  పాత కాయితాలు తిరగేస్తే, తెలిసినది ఏమిటంటే, మా పాత వాహనం కొనుగోలు చేసినవాడు దానిని తన పేరిట మార్చుకోలేదు.    వాహన బీమా కూడా మా కంపెనీ పేరిట వాడే క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాడు.   షోరూము వాడు మా దగ్గర నుండి 10,000 నగదు (పాత వాహనం విలువ) గాను మిగిలినది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలోనూ ముట్టినట్లు కొత్త బండి తాలూకు బిల్లులలో చూపించాడు.      బండి కొనుగోలుదారుడు చేసిన తప్పులకు మేము న్యాయస్థానం చుట్టూ తిరగ వలసి వస్తున్నది.     

అందుకనే, ఏదైనా వాహనం అమ్మినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా న్యాయవాదిని సలహా అడిగితే, ఆయన చెప్పిన అంశాలు -- 

-- కొనుగోలు చేసిన వ్యక్తీ నుండి రశీదు తీసుకోవడం (Delivery నోట్) మరవద్దు
-- వాహనం అమ్మిన మరుసటి రోజే, సంబంధిత బీమా సంస్థకు మరియు ఎక్కడైతే వాహనం మొదట  నమోదు
    అయ్యిందో ఆ యొక్క R.T.A కార్యాలయానికి ఈ transaction తాలూకు వివరాలు డెలివరీ నోటు నకలుతో
    రిజిస్టర్డ్ పోస్టు చేసి దాని రశీదును భద్రపరచుకోవడం మంచిది.
-- వాహనం కొనుగోలు చేసిన వారి నుంచి వారి లైసెన్స్ కాపీ ఉంచుకోవడం మంచిది.
-- వాహనం అమ్మిన నెల తరువాత  R.T.A వారి వెబ్ సైట్ లో వాహనం సంఖ్యతో దాని ఓనర్ పేరు తెలుసుకోవచ్చు
     దానిలో ఇంకా మీ పేరే వుంటే మీరు తక్షణం మేల్కొని R.T.A ను సంప్రదించండి

పైన తెల్పిన వివరాలు  చదవడానికి చాలా చిన్నవిగా వుంటాయి.  అనుభవించే వాడికి అసలు విషయం తెలుస్తుంది. బైకుకు ఏక్సిడెంట్ అయింది కాబట్టి ఏదో రకంగా రాజీకి వచ్చి డబ్బులిచ్చి వదిలించుకోవచ్చు.    అదే బైకు అసాంఘీక శక్తుల చేతులో పడితే అంతే సంగతులు.  


21, జూన్ 2014, శనివారం

హిందీ జాతీయ భాష కాదు

ఏదో ఒక సంచలన ప్రకటన చేసి అసలు విషయాలను పక్క దారి పట్టించడం పాలకులకు పరిపాటైంది.   రైల్వే చార్జీలు పెంచిన ప్రకటన వెలువడిన రోజే దేశంపై హిందీ భాష దాడి వార్తను కూడా వెలువరిస్తారు.   కరుణానిధి లాంటి వాళ్ళు రైల్వే చార్జీల పెంపు పక్కన పెట్టి హిందీ గురించి మాట్లాడతారు.   

హిందీ మన జాతీయ భాష కాదు అని ఇటీవలే గుజరాత్ ఉన్నత న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది.  సురేష్ కచ్చాడియా వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంలో తీర్పు ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం, దేశంలో ఎక్కువ మంది మాట్లాడుతున్న భాషగా హిందీ వుందని, దానిని జాతీయ భాషగా రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన లేదని తీర్పు ఇచ్చింది.  

అధికార భాషా చట్టం 1963 ప్రకారం పార్లమెంటు కార్య కలాపాలు హిందీలో మరియు ఆంగ్లంలో జరపవచ్చని పేర్కొంది.   పార్లమెంటు చేసే ప్రతి చట్టం హిందీ లోను  ఆంగ్లంలోను అందుబాటులో ఉండేలా నిర్దేశించింది.  

దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ.  అందులో సందేహం లేదు.   దానిని బలవంతంగా మరింత ప్రోత్సహించాల్సిన అవసరం మాత్రం లేదు.   ఉత్తరాది వారికి ఇప్పటికీ దక్షిణాది వారంటే చులకన.  దక్షిణాది వారి భాష, వేషం, ఆచార  వ్యవహారాలను వారు ఈసదించుకుంటారు.   

ప్రస్తుతం దేశం ఎదుర్కుంటున్న సమస్యల ముందు హిందీ భాష బలవంతంగా రుద్దడం అనేది ప్రాముఖ్యత లేని విషయం.   దేశం మొత్తం త్రిభాషా సూత్రాన్ని అమలు చేసి, ఎవరు ఏ భాషలో చడువుకోవాలి అనేది వారి వారి స్వంత నిర్ణయంగా వదిలి వెయ్యాలి.    కర్ణాటక రాష్ట్రంలో ప్రాధమిక, మాధ్యమిక విద్యనూ కన్నడ మాధ్యమంలో చదివిన విద్యార్ధులకు వైద్య మరియు తాంత్రిక విద్యలో 5 శాతం రిజర్వేషన్ వుంది.   కన్నడ మాధ్యమం విద్యార్ధులు గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలలో చదివితే రిజర్వేషన్ మరింత ఎక్కువ.   వాళ్ళ భాషను ప్రోత్సహించే విధానం యిది. 

ఉద్యోగం కోసం ఆంగ్లం, దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళడానికి హిందీ ఆత్మ సంతృప్తికి అమ్మ భాష అవసరం. 

12, జూన్ 2014, గురువారం

తెలుగు నాడు లేక తెలుగు సీమ

నవ్యాంధ్ర ప్రదేశ్ కు ఏ పేరు బాగుంటుంది అనే విషయంపై ప్రముఖ తెలుగు ఉపన్యాసకులు ఆచార్య ఆర్ వి సుందరం గారు తెలుగు తేజం పత్రికలో ఒక వ్యాసం రాశారు.   దాని పూర్తి పాఠాన్ని సంపాదకుని అనుమతితో బ్లాగులో వుంచుతున్నాను.


3, జూన్ 2014, మంగళవారం

దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రం కర్ణాటక


ఈ రోజు బెంగలూరు మిర్రర్ దిన పత్రికలో ప్రముఖ చరిత్ర కారుడు శెట్టర్ వ్యాస్యం మొదటి పుటలో అచ్చైనది.   పాఠకుల కోసం వ్యాసం లింకు ఇస్తున్నాను.    చరిత్ర పుటల్లోకి తీసుకెళ్ళిన మంచి వ్యాసం. ఇది తప్పక చదవ వలసిన విషయం. మీ కోసం ............

http://www.bangaloremirror.com/bangalore/cover-story/We-are-the-biggest-souther-state-now/articleshow/35963324.cms?

2, జూన్ 2014, సోమవారం

మరో తెలుగు రాష్ట్రం ఏర్పడక తప్పదా ?


గత రెండు వారాలుగా జరుగుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  పరిస్థితులను గమనిస్తే ప్రత్యేక రాయలసీమ కూడా ఏదో ఒక రోజు ఆవిర్భవించక తప్పదేమో అనిపిస్తుంది.     అన్ని కార్యాలయాలు ఒకే చోట పోగు చేసే కుట్ర జరుగుతున్నది.   

రాజధాని గుంటూరు-బెజవాడ మధ్య 
వ్యవసాయ విశ్వ విద్యాలయం - గుంటూరు జిల్లా లాం అనుకూలమైనది 
రైల్వే డివిజన్ - బెజవాడ  బాగా అనుకూలమైనది 
శాసన సభ - రాజధాని ఎక్కడుంటే అది కూడా అక్కడే వుండాలి కదా 
ఆర్టీసీ కేంద్ర కార్యాలయం - విజయవాడైతే బాగుంటుంది 
మెట్రో రైలు - విజయవాడ - గుంటూరు - తెనాలి బాగా అనుకూలం 
అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం - విజయవాడ నుంచే జనాలు ఎక్కువ                                                          విమానం ఎక్కువ ఎక్కుతారు 
రాష్ట్ర పర్యాటక శాఖ కార్యాలయం - ఇంకెక్కడ విజయవాడ 
ఉన్నత న్యాయ స్థానం - గతంలో ఒప్పుకున్న గుంటూరు 
డి ఐ జి కార్యాలయం - మంగళగిరిలో పానకాలు స్వామి సాక్షిగా 


ఇక మిగిలినవి -- 
పెద్ద కేంద్ర కారాగారం - కడప బాగా అనువైనది 
ఐ ఐ టి - ఇచ్చినప్పుడు చూద్దాం 
ఐ ఐ ఎం - వచ్చినప్పుడు చూద్దాం 

మరి రాయలసీమకో - ముఖ్యమంత్రే రాయలసీమ నుంచి వచ్చాడు.   అదో పెద్ద వరం.  

ఇప్పటికే హైదరాబాదు కేంద్రంగా జరిగిన అభివృద్ధితో తల బొప్పి కట్టింది.   ఇప్పుడు విజయవాడ కేంద్రంగా అదే తంతు జరగబోతోంది.    రాష్ట్రాలు ఏర్పడింది, ఏర్పడేది రియల్ ఎస్టేట్ యజమానులకొసమా లేక సామాన్యుల కోసమా తెలియని పరిస్తితి.   సామాన్యుడు గుంటూరు విజయవాడ పరిసరాల్లో సెంటు స్థలం కొనుగోలు చేసే పరిస్థితులలో లేదంటే నమ్మండి.    

వచ్చే ఎన్నికలలో కూడా జగన్ పార్టీ,  కాంగ్రెస్ పార్టీ చతికిల పడితే, తీరిక సమయం ఎక్కువ వుంటుంది కాబట్టి విజన్ 2025 లో భాగంగా ప్రత్యెక రాయలసీమ ఉద్యమం బలపడే అవకాశం వుంది.    ఏం తెలుగు వారికి మూడు రాష్ట్రాలు ముగ్గురు ముఖ్యమంత్రులు వుంటే తప్పా?   శ్రీ బాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కారు.   మేము మద్రాస్ తోనే కలిసివుంటాం అంటే, మమ్మల్ని మభ్య పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో కలుపుకున్నారు.   సినిమాలలో మమ్మల్ని ఫాక్షనిష్టులుగా చూపిస్తూ అవమాన పరుస్తున్నారు.  మా భాష వేరు మా యాస వేరు, మా తిండి వేరు, మా వేష భాషలు, సంస్కృతి వేరు. అమాయక రాయలసీమ ప్రజలను ఆంధ్రులు ఎంతకాలం దోపిడీ చేస్తారు అని వరస డవిలాగులు మళ్ళీ ఒక దశాబ్దం తరువాత వినాల్సి రావచ్చు. హంపీ కోట బాక్ డ్రాపుతో తిమ్మమ్మ మర్రిమాను సాక్షిగా మరో లోగో గీయవచ్చు. 

ఆర్ధికంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ (ముఖ్యంగా అనంతపూర్) ప్రాంతాలకు మంచి జరిగినప్పుడు మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలోని అసమానతలు తొలగి మరో విభజనకు బీజం పడకుండా వుంటుంది. 

తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు


భారత దేశ 29 వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు.   దేశంలో మొట్టమొదటి సారిగా ఒక ప్రాంతీయ భాష మాట్లాడే ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడినట్లైంది.   భౌగోళికంగా తెలుగు వారు రెండు రాష్ట్రాలలో వున్నా మనం మాట్లేడే భాష తెలుగు.   తెలంగాణా అంటేనే తెలుగు మాట్లాడే ప్రాంతం.   అచ్చ తెలుగు మాట్లాడే ప్రాంతం తెలంగాణా అని నేను నమ్ముతాను. 


ఈ శుభ సమయంలో ఒక ప్రాంతం వారు గెలిచారానో మరో ప్రాంతం వారు ఓడారనో భావించడం మూర్ఖత్వం.   రాష్ట్ర విభజన ప్రక్రియలో రాజకీయ క్రీడ పరాకాష్టకు చేరింది.   ఈ క్రీడలో  కాంగ్రెస్ పార్టీ  పోషించిన పాత్ర తెలంగాణా లో స్థిరపడ్డ తీర సీమాన్ద్రులని కూడా కలిచివేసింది.   వారిలో ఎక్కువ మంది తెరాసకు ఓటేశారే కాని, కాంగ్రెస్  వైపు మొగ్గు చూపలేదు.   ఇది కూడా శుభ పరిణామమే.    


ఈ రోజు నుండైనా రెండు రాష్ట్రాలలోని తెలుగు వారందరు మరి ముఖ్యంగా నెటిజన్లు ఒకరినొకరు దూషించుకోకుండా  ప్రేమానురాగాలతో   అభివృద్ధి పధంలో పయనిద్దాం .