25, జూన్ 2014, బుధవారం

ఆంధ్రా కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి


అయ్యలారా, 

ఇటీవలి ఎన్నికలలో మీరు ఘోర పరాజయం పొందిన పిమ్మట మీరందరూ కలసి కూర్చొని ఓటమికి గల కారణాలు విశ్లేషించారు.   ఇది ఒక రకంగా సంతాప సభలా జరిగింది.   ఇందులో వచ్చిన కొన్ని సూచనలలో ముఖ్యమైనవి అ) పార్టీకి ఒక టి వి మరియు పత్రిక కావాలని ఆ) పార్టీ అధ్యక్షురాలు మరియు యువ నేత ఆంధ్రాలో తరచూ పర్యటించాలని -- 


నిజంగా మీరు పార్టీ శ్రేయస్సు కోరుకొనే నాయకులైతే దయచేసి ఈ రెండు పనులు మాత్రం చెయ్యవద్దు.  పొరపాటున ప్రజలు మీ చానల్లో సోనియా గాంధీ బొమ్మ చూసారంటే,  వాళ్లకు గతంలో తెలుగు వారిని చీల్చి చెండాడుతూ  ఆమె జరిపిన దాడి (యుద్ధ విమానంలో బిల్లు పంపడం, పార్లమెంటులో దీపాలార్పడం) వగైరాలు గుర్తు వచ్చి మానుతున్న గాయాన్ని మళ్ళీ గెలికింది మీరే అని మిమ్మల్ని ఇంకా ఘోరంగా శిక్షించే  ప్రమాదం వుంది.   


పోనీ పాపం మీరు పత్రిక పెడితే, ఎవరిని విమర్శిస్తారు -- తెదేపాను విమర్శిస్తే, జగన్ బలం పెరుగుతుంది, జగన్ను విమర్శిస్తే తెదేపా బలం పెరుగుతుంది.   మిమ్మల్ని మీరు పోగుడుకునే దానికి అక్కడ ముడి సరుకు లేదు. కాబట్టి పరిస్తితులు కొంత అనుకూలించే వరకు పొరపాటున కూడా ఆ పని చెయ్యవద్దు.   


ఎన్నికల సమయంలో మీకు చేతై నంత వరకు మీరే ప్రచారం చేసుకోండి గానీ పొరపాటున కూడా ధిల్లీ నుంచి ఎవరినీ పిలవవద్దు.  సినిమా పిచ్చి కాస్త ఎక్కువగా వున్న ఆంధ్ర ప్రజలు కూడా చిరంజీవిని తిలకించడానికి ఇక ముందు సభలకు రారు.  కనీసం మీ అంతట మీరు ప్రచారం చేసుకుంటే, ఇద్దరికో మహా అయితే పది మందికో ధరావతు దక్కే అదృష్టం వుంది.   పై నుంచి మీ నాయకులు తరచూ వస్తే అది కూడా కష్టమే.   ఒక పది సంవత్సరాలు ఓపిక పట్టండి, ఒకటో ఆరో సీట్లు రాక మానవు.  


ఇప్పటికీ ఏదో ఒక మూల కాంగ్రెస్పై కాస్తో కూస్తో అభిమానమున్న వాడిగా సిగ్గుతో ఈ సలహా ఇస్తున్నాను, తప్పక పాటించ గలరు.  

4 కామెంట్‌లు :

  1. ఇప్పటి వరకూ విభజన బిల్లులోని బయట పడిన ప్రతి అంశమూ అసలీ బిల్లు వండి వార్చిన వాళ్ళకి తెలంగాణా తప్ప ఆంధ్ర ప్రాంతం అనేది ఒకటి ఉండేది,ఉంటుంది అని కూడా తెలియనంతగా ఆంధ్రాని నిర్లక్ష్యం చేసారని తెలుస్తుంది.నా అంచనా ప్రకారం ఈ తగాదాలు తీరడానికి యాభయ్యేళ్లయినా పట్టవచ్చు,హీన పక్షం ఇరవయ్యేళ్ళు!అప్పటి వరకూ ఈ రెండు ప్రాంతాల్లో కాంగ్రెసుని సొంత పత్రిక గానీ టీవీ చానల్ గానీ పై వాళ్ళ మొహాలు గానీ యేవీ గెలిపించ లేవు.

    రిప్లయితొలగించండి
  2. హరిబాబుగారూ, కనీసం మరొక నూరేళ్ళ తరువాతగాని కాంగ్రెసుపార్టీ సీమాంధ్రలో కోలుకోలేదు. కాని అప్పటిదాకా నేను ఉండను కాబట్టి ఆ దుస్థితిని నేను చూడనక్కరలేదు. ఎలాగూ మరొక ఇరవై యేళ్ళైనా ఈ‌ కాంగ్రెసు బ్రతికి ఉండే అవకాశాలు దాదాపు మృగ్యమే కాబట్టి ఆంధ్రసీమలో కాంగ్రెసువారి గెలుపుతాలూకు వికటాట్టహాసాలు వినే దౌర్భాగ్యం ఎవరికీ రాదనే చెప్పవచ్చును.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తధాస్తు!నా కోరిక కూడా అదే, కాకపోతే మన ప్రజల మనస్తత్వం వింతగా ఉంటుంది ఒకోసారి. మనందరం కాంగ్రెసుని ఇలా తిట్టదం చూసి "పాపం అందరూ కాంగ్రెసు వాళ్లని యెలా తిడుతున్నారో గదా?!" అనే జాలి తో కూడిన ఆలోచన వొచ్చిందో, అంతే సంగతులు - యెన్నికల్లో స్వింగ్ అనేది దాని పని అది చేస్తుంది.అలాంటివన్నీ కొంచెం ప్రాక్టికల్ గా లెక్క వేసాను ఇరవయ్యేళ్లని. కానీ నా బలమయిన కోరిక కూడా అదే- కాంగ్రెసు అనే పార్టీ ఈ దేశపు రాజ్కీయ రంగం మీద లేకుండా పోవాలి.కొంత మందికి గత చరిత్ర వల్ల ఒక పార్టీ గా ఉండతం వల్ల నష్ట మేముంది అని అనుకోవచ్చు గానీ ఇపుడు యేమయినా లోటు వుందా?లేదే!

      తొలగించండి
  3. చానెల్ లేదా పత్రికలు పెట్టుకున్నంత మాత్రాన ఒరిగేది ఏమీ ఉండదు. సీపీఅయి & సీపీఎం పార్టీలు దశాబ్దాలు నుండి పత్రికలు పెట్టుకున్నారు. మార్క్సిస్టులు ఇటీవలే టీవీ చానెల్ తెరిచారు. ఆంధ్రలో రెండు పార్టీలకు కలిపి రెండు లక్షల వోట్లు దాటలేదు.

    నల్లారి వారి పార్టీ ఏదో పొడిచేస్తుందని వారి చానెల్ ఊదరగోట్టింది. అయినా వారి గోడు వినిపించుకున్ననాధుడే లేడు.

    మీడియా మద్దతుతో గద్దె అలంకరించడం ఒకప్పుడు కుదిరిదేమో కానీ ఆ రోజులు పోయాయి. అలాగే సినిమా వాళ్ళని వాడుకుంటే సభలో జనం నిండుతారేమో కానీ వోట్లు పడతాయన్న నమ్మకం ఏకోశానా లేదు.

    రిప్లయితొలగించండి