6, డిసెంబర్ 2012, గురువారం

డిసెంబర్ 28న ఏమి జరగవచ్చు??

127 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా సమస్యను పరిష్కరించడం ఒక పెద్ద విషయం కాదు. అసలు తెలంగాణా సమస్య సృష్టికర్తే కాంగ్రెస్స్ పార్టీ? మలిదశ తెలంగాణా ఉద్యమం ప్రారంభమయినదే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం. జగను కి వస్తున్న ప్రజా మద్దతు చూసి, అతని మొండితనం చూసి భయం వేసి, ప్రజల దృష్టిని మరల్చేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగానే క చ రా గారిని పురికొల్పడం జరిగిందంటే నమ్మక తప్పదు. కానీ, ఉద్యమం ఎప్పుడైతే విద్యార్ధుల చేతిలో పడిందో, రాజకీయ పార్టీల నోట్లో పచ్చి వేలకాయ పడ్డట్లు అయింది. ఈ పరిణామం పాపం క చ రా గారు కూడా ఊహించి వుండరు. అయితే, ఆ సమస్యను పరిష్కరించడం కూడా వారికి తెలుసు. నిన్నటి అఖిల పక్ష సమావేశ ప్రకటన అలాంటి ఎత్తుగడలో భాగమే. గుత్తా, మందా, రాజయ్య, యాస్కీ, వినోద్ ఇత్యాది ఎం పీ లు ఎవరిదారి వారు వెతుకుకుంటున్నారని తెలిసి, అఖిల పక్షం ప్రకటన చేసారు. ప్రస్తుతానికి డిసెంబర్ 28 వరకు ఎవరు నోరెత్తడానికి వీల్లేదు. ఇది తె రా సా కు సుతరాము ఇష్టం లేదు. వారికి కావలసింది అన్ని పార్టీల నుంచి వలసలు, వోట్లు నోట్లు సీట్లు? ఈ నెల 28 వరకు వలసలు ఉండటానికి ఆస్కారమే లేదు. దీని వలన ఎఫ్ డి ఐ వోటింగులో ఎం పి లలో చీలికను నివారించ గలిగింది.
 
డిసెంబరు 28న జరిగే అఖిల పక్ష మీటింగులో మనకు ఈ దిగువ పొంద పరచబడిన సూత్రాలలో ఏదో ఒకటి అనుకరించే అవకాశo వుంది.
 
అ) మీటింగుకి తెరాసా, తెదేపా, వైఎసార్ పార్టీలు ఒక షరతు విధించే అవకాశం వుంది. అన్ని పార్టీల అధ్యక్షులు ఈ అఖిల పక్షంలో పాల్గొనాలి అని. దానితో ఈ మీటింగ్ చాయ్ బిస్కెట్ మీటింగు గా చరిత్రలో చిరస్థాయిగా నిలిపోయే అవకాశం వుంది.
 
ఆ) ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు వేరు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు వేరు. ఇట్లాంటి కిట్టీ పార్టీలలో పాల్గొనే స్థాయి కాంగ్రెస్స్ పార్టీ అఖిల భారత అధ్యక్షులది కాదు. ఆమె పాల్గొనక పొతే ప్రాంతీయ పార్టీ అధ్యక్షులు దానిని సాకుగా తీసుకొని వారు పాల్గొనక పోవచ్చు. ఒక వేళ పాల్గొన్నా, ఈ సమస్యను సృష్టించినది మీరు కాబట్టి, మీరే పరిష్కరించండి అంటారు.
 
ఇ) ఒక్కొక పార్టీ నుంచి ముగ్గిరికి మించకుండా ప్రతినిధులు పాల్గొనవచ్చు అని చెప్పొచ్చు. ఈ వెసులు బాటు వలన 3 ప్రాంతాలలో ముగ్గురు పోటీదారులు కలివిడిగా విడి విడిగా వారి వారి వాదనలు వారి వారి ప్రాంత "మనోబావాలను"  ప్రకటించి కలిసి మెలిసి ఒకే విమానంలో హైదరాబాద్ వచ్చి  విడి విడిగా పత్రికా విలేకరుల సమావేశం పెట్టొచ్చు.
 
ఈ)అఖిల పక్షం సమావేశం అన్నారు గాని, కేవలం ఆంద్ర ప్రదేశ్ కి సంబంధిచిన అఖిల పక్షం అనలేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ, యు పి ఎ భాగ  స్వామ్య పక్షాలన్నిటిని ఆహ్వానించి "తూచ్" వాళ్ళు ఒప్పుకోవడం లేదు అని చెప్పించవచ్చు.
 
ఉ) స్వర్గీయ జస్పాల్ భట్టీ గారి డ్రామాలలో చెప్పినట్టు, ఈ మీటింగ్ లో వచ్చే సమావేశం జరిగే తారీకు ఖరారు చెయ్యవచ్చు. 
 
ఊ) దేశం మొత్తం " రాష్ట్రాల పునర్ విభజన కమిటి" పేరుతొ ఒక  కాల యాపన కమిటీ వెయ్యొచ్చు.
 
ఋ) తెదేపా, వై ఎస్ ఆర్ పార్టీలు - మేము తెలంగాణాకు వ్యతిరేకం కాదు అని చెప్పొచ్చు.
 
ఋ) తె రా కి "పేకేజీ" ఇవ్వొచ్చు.
 
లు) హైదరాబాద్ ని రెండవ దేశ రాజధానిగా ప్రకటించి డా.అంబేద్కర్ గారి కలలని నిజం చెయ్యొచ్చు.
 
 
లూ  ) మన గవర్నర్ గారు చెప్పినట్లుగా డిసెంబర్ 28 తరువాత  డిసెంబర్ 29 రావొచ్చు.
 
అసలే బాబు గారు నడవలేక పోతున్నారు. ఇవ్వాల్టి నుంచి ఆయన తొందరగా ఎక్కువ దూరం నడిచి బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటినట్లు, తెలంగాణా గండంనుంచి బయటపడి తీర ఆంధ్ర ప్రాంతం చేరుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
 

3 కామెంట్‌లు :

  1. మీ ఆప్షనల్స్ బాగున్నాయి.

    ఎ). తెలంగాణపై ఏదీ తేల్చకుండా ఇలాగే కాలయాపన చేస్తే.... మొదట టీ ఎంపీలు, తర్వాత కిందిస్థాయి కార్యకర్తలు తట్టా బట్టా సర్దుకుని ఇతర పార్టీల్లో చేరవచ్చు. ఆ తర్వాత తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ కు ఫలితం దక్కక, అటు ఆంధ్రలో , ఇటు తెలంగాణలో అంతర్ధానం కావచ్చు. చివరకు కాంగ్రెస్ తన గోతిలో తానే బొక్క బోర్లా పడవచ్చు.

    రిప్లయితొలగించండి
  2. చంద్ర శేఖర్ గారూ,

    మనం కాంగ్రెస్ పార్టీని తక్కువగా అంచనా వెయ్యొద్దు. రాజకీయలలొ తల పండిన "మేనేజర్లు" వున్నారు.

    ప్రస్తుతం రాజకీయం అనేది ఒక వ్రుత్తిగా మారింది. పాపం టంగుటూరి ప్రకాశం పంతులు గారిని చూడండి, ఉన్న ఆస్తి కరిగించి ప్రజా సేవ చేశాడు. ఆయన మునిమనవడికి ఆస్తి లేక, ఉద్యోగం లేక దయనీయ పరిస్తితిలో వుంటే ప్రభుత్వం దయతలచి ప్యూనుగా కలెక్తర్గారి కార్యాలయంలో ఉద్యోగం ఇప్పించింది. ఇవ్వాళ ఒక్కొక రాజకీయ నాయకుడికి ఎన్ని తరాలైనా కూర్చొని తింటే తరగని ఆస్తులు వున్నై.

    రిప్లయితొలగించండి
  3. తె రా కి "పేకేజీ" yes.

    గవర్నర్ గారు చెప్పినట్లుగా డిసెంబర్ 28 తరువాత డిసెంబర్ 29 రావొచ్చు.
    :))))

    రిప్లయితొలగించండి