4, మే 2013, శనివారం

బాధను దిగమింగి యు పి ఎస్ సి పరీక్షలో వికసించిన కోమల్


Deserted by husband just after marriage, Gujarat girl clears top UPSC exam


కోమల్ ప్రవీణ్  భాయ్  గణతార - గుజరాత్ లో  ఈ రోజు వార్తల్లోని వ్యక్తి.    నిన్న యు పి ఎస్ సి విడుదల చేసిన ఫలితాలలో దేశంలో 591 వ స్థానంలో, గుజరాత్ నుంచి సివిల్ సర్వీస్ కు ఎన్నికైన  11 మందిలోనూ ఒకరు.    చాలా మంది మహిళలు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులలో రాణిస్తున్నారు  ఇది గొప్ప విషయమేమీ కాకపోవచ్చు.   కానీ పెళ్ళైన పదిహేను రోజులకు కట్నం చాలలేదని భర్త వదిలేసిన వర కట్న బాధితురాలు ఈ మహిళ. 

భావనగర్ జిల్లాలోని ఒక కుగ్రామములో ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఈమె తన కష్టాన్ని దిగమింగుకుంటూ పట్టుదలతో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణురాలై  భారత రెవెన్యూ సేవలలో ప్రవేశించబోతోంది .  ఆమ్రేలి జిల్లాలోని సవరకుండ్ల గ్రామానికి చెందిన ఒక విశ్రాంత ఉపాధ్యాయుడి కుమార్తె కోమల, న్యూజిలాండ్ లో స్థిరపడిన తన భర్త శైలేష్ పోపట్ పై న్యాయ పోరాటానికి సిద్ధమౌతోంది .    ఇప్పటి దాకా ఆర్ధిక పరిస్థితి సహకరించనందున  మరియు తన ముందున్న లక్ష్యాన్ని ఛేదించాలనే  తపనతో,  కట్నం కోసం తనను వదిలేసిన భర్తపై న్యాయ పోరాటానికి సిద్ధపడలేదు. "కేవలం నేను పేద కుటుంబం నుంచి వచ్చానని, కట్న కానుకలు తగినంతగా ఇవ్వలేదన్న కారణంగా  నన్ను వేధించిన నా భర్త, అత్తా మామలపై చట్ట పరంగా పోరాడుతాను" అంటున్నారు కాబోయే ఐ ఆర్ ఎస్ అధికారి కోమల.  తన భర్త శైలేష్ న్యూజిలాండ్లో ఎక్కడ వున్నారో, ఏమి ఉద్యోగం చేస్తున్నారో, అతని చిరునామా, ఫోన్ నంబర్  కూడా తనకు తెలియదని ఆమె వాపోయారు.  

"ఐదు సంవత్సరాల క్రితం నా నుంచి దూరంగా వెళ్ళిన శైలేష్ తనను ఎప్పుడు సంప్రదించలేదని, ఇంత  వరకు విడాకులు కూడా కోరలేదని" ఆమె తెలిపారు 

 శైలేష్ ఎం ఎస్ సి (రసాయన శాస్త్రం) లో రాజ్ కోట్ నుంచి  స్నాతకోత్తర పట్టా కలిగి వుండగా,  కోమల్ రాజ్ కోట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి రసాయన శాస్త్రంలో డిప్లోమో మరియు డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్య ద్వారా బి ఎ ఆ తరువాత సవరకుండల నుంచి ఉపాధ్యాయ శిక్షణా వృత్తిలో సర్టిఫికేట్ను కలిగి వున్నారు. 

అత్యున్నత హోదా కలిగిన సివిల్ సర్వీసెస్లో చేరాలన్న ధృడ సంకల్పంతో 2008 లో యు పి  ఎస్ సి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే  అహమ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్  అఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో   చేరింది కోమల్.  జనరల్ విభాగం లో నాలుగో సారి చేసిన ప్రయత్నం ఫలించింది.   గుజరాతీ మాధ్యంలో ఇంటర్వ్యూ కు హాజరైన కోమల్, చరిత్ర మరియు గుజరాతీ సాహిత్యం అనే రెండు అంశాలు ఫైనల్ పరీక్షల కోసం ఎంచుకుని విజయం సాధించింది .     

ఇంత పెద్ద కష్టాన్ని గుండె నిబ్బరంతో ఎదుర్కొని లక్ష్యాన్నిముద్దాడిన    కోమల్ ప్రవీణ్ భాయ్ గణతార అభినందనీయురాలు మరియు మనందరికీ స్పూర్తి ప్రదాత. 

1 కామెంట్‌ :