23, ఆగస్టు 2013, శుక్రవారం

చిరంజీవికి దిమ్మతిరిగి మైండు బ్లాంక్ అయ్యింది!


జంధ్యాల దర్శకత్వంలో  25 సంవత్సరాల క్రితం వచ్చిన విజయవంతమైన చిత్రం అహ నా పెళ్ళంట.    ఇందులో కోట శ్రీనివాస రావు చేసే పిసినారి చేష్టలకు ఆయన బామ్మర్ది సుత్తి వీరభద్ర రావు పిచ్చివాడై బట్టలు చింపుకుంటాడు.    భవిష్యత్తులో కలెక్టర్ కావాల్సినవాడు కాస్తా పిచ్చోడవుతాడు.  


విభజన ప్రకటన తరువాత 24 ప్రేముల సినిమా కాస్తా రెండే రెండు ఫ్రేములకు పరిమితమైంది.   విభజనా లేక సమైక్యమా?    ప్రస్తుతం మన చిరుజీవి పరిస్తితి కూడా సుత్తి వీరభద్ర రావులా  తగలడింది.    రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటాడు. అదే సమయంలో   హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా చేయ్యాలంటాడు.   విభజన ప్రక్రియ ముందుకు పోవడం లేదు అయితే వెనుకకు పోయినట్లు నేననుకోవడం లేదు అని 3:8 నిష్పత్తిలో ఆంగ్లం మరియు తెలుగులో పంచుల మీద పంచులు ఇస్తున్నాడు.   ఒక మాటకు ఇంకొక మాటకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. 

ఒకపక్క కొడుకు, తమ్ముడు, మేనల్లుడు సినిమాలు విడుదల కాక, హైదరాబాదు దాటి ఆంధ్రా ప్రాంతం వెళ్ళడానికి మొహం చెల్లక మింగ లేక కక్కలేక అన్నట్లు వుంది ఆయన పరిస్తితి.     18 మంది ఎం ఎల్ ఎ లతో కళ కళలాడాల్సిన చిరు,  ప్రజా రాజ్యాన్ని పళ్ళెంలో పెట్టి కాంగ్రెస్కు ఇచ్చాడు. పార్టీని విలీనం చెయ్యనట్లయితే ఆయనకు వున్న గ్లామర్తో ఈ పాటికి తీరాంధ్ర అనే వెండి తెరపై నిజమైన నాయకుడుగా ప్రజల మనసులు గెలుచుకొని ఉండేవాడు.   ఇప్పుడు  హీరో కాస్తా కమెడియన్ కి ఎక్కువ కారెక్టర్ ఆర్టిస్టుకు తక్కువగా అయిపోయాడు. ఇదేనేమో విధి వైపరీత్యమంటే.    

తగ్గుతున్న రూపాయి విలువ - కొందరికి మోదం మరికొందరికి ఖేదం


రూపాయి మారకం విలువ అంతర్జాతీయ మార్కెట్టులో గణనీయంగా తగ్గుముఖం పట్టింది.   డాలరు విలువ దాదాపు 64 రూపాయలకు ఎగబ్రాకింది.     ఈ మాసాంతానికి రూ॥ 70 వరకు పతనం తప్పదని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.    దీనికి ప్రధాన కారణం విదేశీ పరోక్ష పెట్టుబడుల ఉప సంహరణ(ట).   లాభాల స్వీకరణలో భాగంగా తమ పెట్టుబడులు మూకుమ్మడిగా వెనుకకు తీసుకుంటే, డాలరుకు వున్న డిమాండు పెరిగే అవకాశం వుంది.   


దీనివలన కొన్ని రంగాలతో ముడిపడిన ప్రజలకు అనుకోని లాభం చేకూరితే, కొంతమందికి విపరీతమైన నష్టాన్ని తెచ్చి పెడుతుంది.   అవేంటో చూద్దాం :  


విదేశాలలో పనిచేస్తున్న భారతీయులకు డాలర్ల రూపంలో జీతం వస్తుంది.   డాలర్ విలువ భారత ద్రవ్యంతో మార్పిడి రేటు పెరగడం వలన, మన దేశంలోని వారి NRI  ఖాతాలకు పెద్ద మొత్తంలో జమ అవుతుంది.  సహజంగా వారు స్థిరాస్తి రంగాలలో పెట్టుబడులకు మొగ్గు చూపుతారు.    రూపాయి పతనం ఎంత కొనసాగితే వారి ఆస్తులు అంట పెరుగుతాయి.   


మన దేశం నుండి విరివిగా ఎగుమతయ్యే సాఫ్టువేర్ ప్రోగ్రామ్స్ కు పంట పండినట్లే.  వీటితో పాటు  పొగాకు, సుగంధ ద్రవ్యాలు,  మెడికల్ ట్రాన్స్కీప్షన్ కంపెనీలు, ఉద్యోగులు లాభం పొందుతారు. 


తీవ్రంగా నష్టపోయే రంగాలలో పెట్రోల్, డీజిల్, విదేశాలలో చదువుతున్న విద్యార్ధులు, ట్రాన్స్పోర్టు రంగం, వాహన తయారీ దారులు, ఫార్మా, ఎరువులు, విదేశీ కొలాబరేషన్ వున్న కంపీనులు (రాయల్టీ చెల్లించాల్సినవి).    


నష్టపోయే రంగాలు ఏవీ తమ నష్టాలను లాభాల వాటాలో తగ్గించుకోవు.   ఇవన్నీ వినియోగదారుడి మీదకు అదనపు భారంగా మారనున్నాయి.   డీజిల్ కనీసం లీటర్కు 7 రూపాయలు వరకు పెరగవచ్చు.   క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలవల్ల నిత్య వినియోగ వస్తువులు (FMCG GOODS) ధరలు పెరుగుతాయి.   అదనపు రవాణా భారం ఉప్పులు, పప్పులు, కూరగాయలు మరియు మిగిలిన అన్ని రంగాల మీద పడే అవకాశం వుంది.   ఒకసారి పెరిగిన ధరల ప్రకారం విధించే సర్ ఛార్జ్ మనకు అలవాటుగా మారి అది ధరలు తగ్గినా కూడా అలానే వుంటుంది.    పాపం ప్రధానికి నోరు లేదు, అమ్మగారికి నాలెడ్జ్ లేదు, మంత్రి గారికి మన బాధలతో సంబంధం లేదు.   రిలయన్స్ గోదాముల్లో మగ్గుతున్న ఉల్లిని బయటకు తీయించడానికి అన్ని పార్టీలకు మొహమాటాలు.   మనమే వీటన్నిటికీ అలవాటు పడాలి.       

వేగంగా మారుతున్న రాజకీయాలు


సి డబ్లు సి విభజన నిర్ణయం తరువాత రాష్ట్రంలో మాట తప్పటాలు మడిమెలు పూర్తిగా తిప్పటాలు మొదలయ్యాయి.   ఈ సారి అనూహ్యంగా సిపిఐ, భాజపా, తెరాస  కూడా మడిమెలు తిప్పాయి.   సిపిఐ కి చెందిన కార్మిక సంఘాలు సమైక్యాంధ్ర సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొంటుండగా, అతి వీర తెలంగాణా వాది, విశాలాంధ్ర నారాయణ కూడా సన్నాయి నొక్కులు నొక్కడం మొదలు పెట్టారు.   బహుశా నారాయణకు తత్త్వం బోధ పడినట్లుంది.   ప్రపంచ కార్మికులారా ఏకం కండి - తెలుగు ప్రజలారా విడిపోండి అనే ఆయన గారి నినాదం పెద్దగా వర్కవుట్ అయినట్లు లేదు.    


తెరాస ఏకైక లక్ష్యం తెలంగాణా లాగా, నరేంద్ర మోడీ గారి ఏకైక లక్ష్యం ప్రధాని కావడం.   ఈయన గారు కూడా తన లక్ష్యం కోసం బొంత పురుగుల్ని, గొంగళి పురుగుల్ని ముద్దాడే రకం.   మన రాష్ట్రంలో వోటు హక్కు కూడా  లేని, ప్రసంగం కన్నా ప్రాస మీద ఎక్కువ దృష్టి పెట్టే నెల్లూరు నాయకుడి గారి ఆధ్వర్యంలో మోడీ గారి ప్రైవేటు దర్బారుకు ఒకే సామాజిక వర్గంకు సంబంధించిన నాయకులు ఇటీవల హైదరాబాదులో కలిశారు.   వీళ్ళందరికీ ప్రత్యేక్షంగానో పరోక్షంగానో తెదేపాతో బాదరాయణ సంబంధం కలవారే.   మోడీ గారు  ఎన్టిఆర్ను ప్రశంసించడం మొదలుకొని   పార్లమెంటులో తెదేపా ఎంపీ ల సస్పెన్షన్కు వ్యతిరేకంగా  సుష్మా స్వరాజ్ గారి ప్రవర్తన వరకు భాజపాలో  అనూహ్యమైన మార్పు వచ్చింది. 


కర్ణాటకలో బుధవారం రెండు పార్లమెంటు నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే, భాజపా కనీసం అభ్యర్ధిని నిలబెట్టుకోలేదు సరికదా, జనతా దళ్ కు మద్దతుగా చెమటోడ్చి ప్రచారంలో బహిరంగంగా కష్టపడింది.   ఇవన్నీ మోడీ గారి నాయకత్వంలో వేగంగా మారుతున్న పరిణామాలకు తార్కాణాలు.   సిడబ్లుసి నిర్ణయంతో భాజపా రెంటికి చెడ్డ రేవడైందన్న విషయం కనీస రాజకీయ పరిజ్యానం వున్న ఎవరికైనా అర్ధమౌతుంది.    కనీసం 4-5 సీట్లు తెలంగాణలో రావాలంటే, తెదేపా మద్దతు అవసరం.   నాకది - నీకిది (క్విడ్ ప్రో క్వో) అన్నట్లు మోడీ ప్రధాని అవడానికి తెదేపా సహాయం చేస్తుంది, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి మోడీ గారు పరోక్షంగా సహాయ పడతారు.     


విభజన ప్రకటన వెలువడిన వెంటనే, మన రాష్ట్రంలో ఎక్కువగా నష్టపోయింది ఎవరైనా వుంటే, మొదలు తెరాసా తరువాత చిరంజీవి మాత్రమే.    హార్వార్డ్ విశ్వ విద్యాలయంలో చదివిన ఉద్దండ పిండాలు కాంగ్రెస్ పార్టీలో వున్నారు.   ప్రకటనకు ముందే, చాలా మంది ఉద్యమకారుల్ని విమానాల్లో పిలిపించుకుని మచ్చిక చేసుకున్నారు.   తెరసాకు వ్యతిరేకంగా ప్రకటనల్ని ఇప్పించారు.   విపరీతంగా వలసల్ని ప్రోత్సహించారు.   తెరాసా నాయకుడు తానే కాబోయే రాష్ట్రానికి ప్రధాన మంత్రిలాగా చాలా అవాంచనీయ ప్రకటనలను చేశాడు.   పట్టు విడుపులు లేకుండా సమస్య పరిష్కారం దొరకదని ఆయనకు బాగా తెలుసు, కానీ ఆయన కావాలనే రెచ్చగొడతారు.     ఉద్యమం పది కాలాల పాటు వుంటే ఏదైనా లాభం కానీ, తెలంగాణా వస్తే తనని పట్టించుకునే పరిస్తితే వుండదు.    అందుకు చక్కని ఉదాహరణ మన మెగా  స్టారు గారే.   సినిమాలలో ప్రతి వాడికి వేలు చూపించే స్థాయి నుంచి అమ్మగారి తర్జని ప్రయోగంతో  దగా స్టారుగా రూపాంతరం చెందారు.    తన కుటుంబ సభ్యుల సినిమాలు విడుదలకు నోచుకోక శ్లేష్మంలో పడ్డ ఈగ లాగా అయింది ఆయన పరిస్తితి. 


ప్రస్తుతానికి ఆంద్ర ప్రదేశ్లో అన్ని పార్టీల పరిస్తితి ఇదే.    వచ్చే సార్వత్రిక ఎన్నికల తరువాత కూడా పరిస్తితులలో పెద్ద మార్పు రాకపోవచ్చు.   దీనివలన తీవ్రంగా నష్టపోతోంది ఉద్యోగార్ధులు, పారిశ్రామిక వేత్తలు మరియు మధ్య తరగతి ప్రజానీకం మాత్రమే 

విప్ అంటే ఇదా!



చట్ట సభలలో ఏదైనా వోటింగు సమయంలో ఫలానా పార్టీ విప్ జారీ చేసిందీ అని మనం తరచూ వింటుంటాము. కానీ తమాషాగా నిన్న గౌరవ పార్లమెంటు సభ్యుడు పార్లమెంటు సాక్షిగా కొరడాతో తనను తాను శిక్షించు కున్నారు.   తెలుగు దేశం పార్టీలో గతంలో బంగి అనంతయ్య అనే కర్నూలు నాయకుడు వుండేవారు.  విచిత్ర వేష ధారణకు ఆయన పెట్టింది పేరు.    ఆయన వెకిలి చష్టలను తట్టుకోలేకో మరే కారణం చేతనో ఆయనను పార్టీ నుంచి తొలగించారు.     ప్రస్తుత చిత్తూరు పార్లమెంటు సభ్యులు కూడా విచిత్ర వేషధారణకు పెట్టింది పేరు.  బంగి అనంతయ్య లేని లోటును ఆయన పూడుస్తున్నారు.    మొన్నటికి మొన్న విభజనకు వ్యతిరేకంగా ద్వారకా కృష్ణుని వేషం కడితే, ఈ రోజు కోరడాతోటి (విప్పింగ్) వీర తాళ్ళు వెసుకున్నారు.     ఈయన వస్తుతహా సినిమా నటుడు కూడా.   ఇలాంటి పద్ధతులు పార్లమెంటు ప్రతిష్టను దిగజారుస్తాయి.    సిద్ధాంత పరమైన, చట్టాలను చేయవలసిన పార్లమెంటు సభ్యుడు చెయ్యవలసిన పని కాదు. నిరసన తెలియచేయడానికి  చాలా మార్గాలున్నాయి.    


ఈ కొరడా దేబ్బలేవో మహానాడు తీర్మానం రోజునే విభజనకు అనుకూలంగా తీర్మానించిన  చంద్ర బాబు గారి మీద ప్రయోగించి నట్లైతే ఈ రోజు తనను తానూ శిక్షించుకొనే అగత్యం దాపురించి వుండేది కాదు.   చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ!

9, ఆగస్టు 2013, శుక్రవారం

బై బై రెడ్డి పార్టీ


అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి.    ఇక్కడ నుండి రాజకీయ పార్టీని ప్రకటించినా, తప్పుడు రాజకీయాలు చేసినా ప్రజలు క్షమించినప్పటికీ  ఆ ఏడుకొండల వాడు క్షమించడు.  


ఇంతవరకు తిరుమలలో  పార్టీని ఆవిష్కరించినవారందరూ చరిత్రలో కలిసిపోయిన వారే!  అట్టహాసంగా, వికటాట్ట హాసం చేసి ప్రజా రాజ్యం అని బోర విరుచుకున్న  చిరంజీవి, జై ఆంధ్రా పేరిట హంగామా చేసిన  ముద్రగడ పద్మనాభం, వసంత నాగేశ్వర రావు  & కంపెనీ  ఇందుకు చక్కటి ఉదాహరణలు.   ఈ కోవలోకే రాబోతున్న మరో పార్టీ బై రెడ్డి గారి రాయలసీమ పరిరక్షణ సమితి.  ప్రతి ప్రైవేటు కంపెనీకి ఒక లోగో వున్నట్లు ఈయన గారి పార్టీ లోగో 'తిమ్మమ్మ మర్రి మాను'.      టి ఆర్ ఎస్ లాగా వినిపిస్తున్న ఆర్ పి ఎస్, పార్టీగా మనుగడ సాధించాలంటే, నోటికొచ్చినట్లు మాట్లాడడం, ప్రజలను మభ్యపెట్టగల వాక్ చాతుర్యం , పత్రికా స్వేచ్చ పేరిట ఎవరినైనా నోరు మూయించకల ఒక దిన పత్రిక (రామ్మా రాయలసీమ అనే పేరైతే బాగుంటుంది)  , 24 గంటలు అనర్గళంగా అవాస్తవాలు చెప్పే ఒక వార్తా ఛానల్ (ఆర్ న్యూస్ అయితే శ్రేష్టం) ,  దండిగా డబ్బు కావాలి (సొంత డబ్భు అవసరం లేదు) .  వీటన్నితోపాటు ఒక ప్రత్యేక గీతం/గేయం వుంటే మరీ మంచింది.    ఇందులో ఏ ఒకాటి లేకపోయినా, ప్రస్తుత పరిస్తితులలో సెంటిమెంటు పేరుతొ పార్టీ మనుగడ సాధించడం అసాధ్యం.   

8, ఆగస్టు 2013, గురువారం

అదిరందయ్యా కిరణూ!




కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నిర్వహించిన  విలేకరుల సమావేశం ఆద్యంతం ఆకట్టుకుంది.   ఆయన స్ప్రుజించన అంశాలలో సాగు నీరు, తాగు నీరు,  విద్యుత్ ఉత్పత్తి-వాడకం, రాజధాని  మొదలైన అంశాలు ముఖ్యమైనవి.    ఎనిమిది రోజుల మౌనం తరువాత ఆయన ప్రజల ముందుకు వచ్చినప్పటికీ, ఎంతో నిబ్బరంగా కనిపించారు.


హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి గారి మరణం తరువాత రోశయ్య గారికి బదులు కిరణ్ కుమార్ రెడ్డి ని ముఖ్యమంత్రిని చేసినట్లయితే రాష్ట్రంలో ఇవాల్టి పరిస్తితి దాపురించి వుండేది కాదు.     ఏదేమైనా, ఇవ్వాల్టి ఆయన విలేకరుల సమావేశం నన్నాకట్టుకుంది.    ఈ సంవత్సరం   మే ఒకటి నాడు ఆయన బెంగళూరుకు వచ్చిన సందర్భంలో బెంగళూరులోని తెలుగు సంఘాలకు చెందిన కొంతమందిమి ఆయనను కలిసి ఒక హోటల్లో ఆయన్ని సన్మానించుకున్నాము.   ఆ నాటి ఛాయా చిత్రాన్ని మీతోటి పంచుకుంటున్నాను.   దమ్మున్న మగాడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, శతమానం భవతి    

4, ఆగస్టు 2013, ఆదివారం

ఆంధ్రా నాయకుల దొంగ రాజీనామాలు


తీర సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు మరి ముఖ్యంగా కాంగ్రెస్ ఎం ఎల్ ఎ లు ఎం పీ లు రాజీనామా చేసి సమైక్యాన్ధ్రప్రదేశ్ కోరుకుంటున్నామని ప్రజలను మభ్య పెడుతున్నారు.   విభజన జరిగిపోయిన్ది.   దీనిని అడ్డుకోవడం ఎవరివలనా కాదు.  ప్రస్తుతం తేల్చాల్సింది న్యాయ పరంగా రావాల్సిన ఆస్తులలో వాటాలు, పునర్నిర్మాణానికయ్యే ఖర్చులు, తెలంగాణలో స్థిరపడిన వారికి కల్పించాల్సిన రాజ్యాంగ రక్షణలు మొదలైన  వాటిపై రాజ్యాంగ పరమైన రక్షణలు.     ఇవన్నీ డ్రాఫ్ట్ రూపంలో తయారు చేసి ప్రజలమధ్య వుంచి బిల్లును పార్లమెంటులో ప్రవెశపెట్టాలి.   నిజంగా అడ్డుకోవాలనే తపన లేదా రక్షణలు కల్పించడానికి సోనియా గాంధీ మెడలు వంచాలంటే తక్షణం కాంగ్రెస్ పార్టీ ఎంపీలు (మంత్రులతో సహా)  రాష్ట్రపతిని కలిసి తాము కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ఉత్తరం ఇవ్వాలి.   అలానే, రాష్ట్రంలో కాంగ్రెస్ ఎం ఎల్ ఎ లు మంత్రులు గవర్నర్ ను కలిసి తాము కిరణ్ సర్కార్ పై విశ్వాసాన్ని కోల్పోయామని ఉత్తరం ఇవ్వాలి.    ఇలా చెయ్యకుండా దొంగ రాజీనామాలతో కొత్తగా రాబోయే రాజధానిలో సివిల్ కాంట్రాక్టుల కోసం తీర సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలను  తాకట్టు పెట్టడానికి కూడా వెనుకాడరు.   ఇందులో కావూరి, లగడపాటి, రాయపాటి ముందు వరుసలో నిలుస్తారు.     


నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి ఒక వేళ కాపు సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తే, ఉన్నత విద్యావంతుడు అనుభవము వున్న  పల్లం రాజు లాంటి వాళ్ళకు ఇస్తే మంచిది.   దగా స్టార్ లాంటి అతి తక్కువ చదువు వున్నవాడు, సొంత వూరిలో వోటమి పాలైనవాడు, తెలుగు ప్రజలను సామాజిక తెలంగాణా అని తరువాత సమైక్యమని ఇప్పుడు ప్రత్యేకమనే దగాకోరును మాత్రం ముఖ్యమంత్రిని చెయ్యకపోవడం భవిష్యత్ తరాలకు మంచిది.        

2, ఆగస్టు 2013, శుక్రవారం

ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణా ఖాళీ చెయ్యాలి : క చ రా


తెలంగాణా వచ్చిందన్న పుట్టెడు దుఃఖంతో కుమిలి పోతున్న కె సి ఆర్, తెలంగాణలో పనిచేస్తున్న ఆంద్ర ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణా ఖాళీ చెయ్యాల్సిందే, వేరే దారి లేదు అని హుకుం జారీ చేశారు.    సీమాంధ్ర సినిమా షూటింగులు, విద్యాలయాలు, సెటిల్మెంట్లు, రియల్ వ్యాపారాల ద్వారా బంగారు బాతు  గుడ్లు పెట్టే వ్యాపారాన్ని వదులుకుంటే తనకు మిగిలేది చిప్పే అనే సంగితి తెలిసిపోయింది.   కాంగ్రెస్ పార్టీలో చేరితే తన బతుకు చిరింజీవి బతుకు కన్నా అధ్వాన్నం అవుతుందనీ తెలుసు. 


అందుకే ఏదో విధంగా బెదిరింపులకు దిగడం ద్వారా, వచ్చిన తెలంగాణాకు మెలిక పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.    తనే తెలంగాణా రాష్ట్రానికి దిక్కైనట్లు, కాబోయే ముఖ్యమంత్రి తరహాలో హుకుం జారీ చేస్తున్నాడు.  కనీసం బిల్లు పెట్టిందాకా ఓపిక పట్టకుండా రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నాడు (క్షమించాలి, బిల్లు పెట్టిన తరువాత చెయ్యమని కాదు నా ఉద్దేశ్యం) .   తెలంగాణా వచ్చిన తరువాత వొంటరి పోరు చేసి భంగపడే కంటే.  తెలంగాణా బిల్లు ఇంకా కార్యరూపం దాల్చలేదు అని చెప్పి ప్రజలను మరోసారి రెచ్చగొట్టి ఓట్లు, సీట్లు, నోట్లు దండుకొనే ప్రయత్నంగా  అని అనిపిస్తుంది.


పొరుగు ప్రాంతంలో భావోద్వేగాలు ఉన్నపుడు పెద్ద మనిషి తరహాలో, అయిందేదో అయింది, మనమంతా తెలుగు వాళ్ళం, విడిపోయినా మనమందరం ఒకటే, మీకున్న భయాలు, సందేహాలు నాకు చెప్పండి, ఇక నుంచి నేనే మీకు అండగా వుంటాను అని నష్టపోయిన వాళ్ళ మనసులు గెలుచుకొనే ప్రయత్నం చెయ్యకుండా శక్తి వంచన లేకుండా రెచ్చగొడుతున్నారు.   నిన్నటికి నిన్న హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారి పక్షపాతాన్ని ఎండగట్టారు - కారణం, సీమాంధ్రలో అల్లర్లు జరుగుతుంటే రబ్బరు బుల్లెట్లు ఉపయోగించ వద్దు అని ముఖ్యమంత్రి చెప్పారట. అంటే ఇతగాడి ఉద్దేశ్యం ఎ కె 47 ఎందుకు వాడడం లేదు అని అర్ధం.  కెసిఆర్ గారి పత్రికలో రాస్తారు, అక్కడ ఉద్యమంలో పిడికెడు మంది కూడా పాల్గోటం లేదు అని.  మరి పిడికెడు మంది కోసం ఎ కె 47 అవసరమా?   కె సి ఆర్ నిరాహార దీక్ష జరిగిన మొదటి రోజే రంగు నీళ్ళు నెత్తిన పోసుకొని అగ్గిపెట్టె వెతికి వందాలాది ప్రాణాలు పోవడంలో ఆజ్యం పోసిన ఘనుడీయన.     ఎక్కడ చనిపోయినా పేదలు, యువకులు మాత్రమె.  ఇది వాంచనీయం కాదు.   ఇంతవరకు కె సి ఆర్ కు కానీ, లగడపాటికి కానీ ఒక్క లాఠీ దెబ్బ తగల లేదు. ఇదీ మహాత్మా గాంధీ నడిపిన పోరాటానికి  ఈ కుక్క మూతి పిందేలకు వున్న తేడా.    


మరోపక్క డిగ్గీ రాజా గారు, తెలంగాణా లోని తీర సీమాన్ద్రులకు రక్షణ కల్పిస్తాం అని చెప్పి, తెలంగాణా సమాజాన్ని దౌర్జన్యకారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.   ఆవేశాకావేశాలు రిగిల్చేది ఇరుప్రక్కల వున్న రాజకీయ నాయకులు మాత్రమే!  నిన్న రాయలసీమలో 8వ తరగతి చదివే పిల్లవాడు ఆత్మ హత్య చేసుకున్నాడు.   అంతకుముందు హైదరాబాదులో ఒక ఆటో డ్రైవర్ 610 జీ వో అమలు చెయ్యలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్రం అంటే ఏమిటో 8వ తరగతి పిల్లవాడికి తెలియదు.  610 జీవో ఆటో చోదకుడికి సంబంధం లేనిది.   ఆవేశంతో తీసుకునే నిర్ణయం తీవ్రంగా  వుంటుంది. 


కొంచం ఉద్రిక్తతలు తగ్గగానే, కె సి ఆర్ తో సహా, అన్ని ప్రాంతాల నాయకులు ఆంధ్రప్రాంతంలో పర్యటించి, ఆయన మీద వాళ్ళకున్న ద్వేషాన్ని పోగొట్టే ప్రయత్నం చెయ్యాలి.  ఆయన లాంటి మాటకారి (కిలాడీకి) ఇదేమి గొప్ప విషయం కాదు.   అలానే, ఇరు పక్షాల విశ్వ విద్యాలయ విద్యార్ధుల నాయకులు నెలరోజులపాటు విశ్వవిద్యాలయాల  ఇంటర్ చేంజ్ చేసుకొని తద్వారా మమేకం అయ్యేందుకు ప్రోత్సహించాలి.  పనిలో పని, పొన్నం ప్రభాకర్ గారికి పుల్లట్లు కూడా తినిపించాలి.   ఇంత కాలంగా విష బీజాలు నాటిన నాయకులు తమ అహాన్ని చంపుకొని ఈ చర్యలకు పూనుకోవాలి.   ఇది జరగకుండా విభజన జరిగితే, తెలంగాణా రాష్ట్రం మీద పెట్టుబడి దారులకు అపనమ్మకం ఏర్పడి  నష్టపోయే ప్రమాదం వుంది.  


ఇరుపక్షాలకు  ఆమోద యోగ్యమైన పద్ధతిలో,   కేంద్రం విధి విధానాలను రూపొందించి రాష్ట్ర విభజన జరిగినా నష్టం లేదు అనుకొనే వారు చాలా మంది తీర ప్రాంతంలో వున్నారు.   అహంకారాన్ని పక్కనబెట్టి, ఇరు ప్రాంతాల పెద్ద మనుషులు, మేధావులతో (నాన్ పొలిటికల్) తక్షణం ఒక కమిటీ వేసి, సమస్యాత్మ విషయాలు వాటి పరిష్కారాలు గుర్తించాల్సి వుంది.  తమ కోరికను సాధించుకున్న వారు కొంత పట్టు విడుపు ధోరణి అవలంబించాలి.  వైషమ్యాలు పెంచి పొషించి   ఎన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఇంకా తగల పెడతారు.   దీనివలన తెలుగు జాతి పరువు పొరుగు  రాష్ట్రాలలో నవ్వులపాలైంది. 

  

1, ఆగస్టు 2013, గురువారం

పదవులకు కాదు - పార్టీలకు రాజీనామా చెయ్యండి


చదవేస్తే వున్న మతి పోయిందిట.   రాజీనామా చేసి పలాయనం చిత్తగించేకన్నా, పార్టీలకు మంత్రి పదవులకు రాజీనామా చేసి శాసన సభలో బిల్లు ప్రవేశ పెట్టినపుడు తమ వాదనను పార్టీ  రహితంగా వినిపించాలి.   నిజంగా బాధ వున్న, బాధ్యత వున్న రాజకీయ నాయకులైతే, ముందుగా తీర సీమాంధ్ర ఎంపీలు మంత్రి పదవులకు పార్టీకి రాజీనామా చేసి, బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టినపుడు వ్యతిరేకంగా వోటు వెయ్యాలి.   మంత్రులు తమ రాజీనామాలను నేరుగా రాష్ట్రపతికి ఇస్తే తక్షణం ఆమోదం తెలపాల్సి వుంటుంది.    ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు  లేఖ అందచెయ్యాలి.   ప్రజలను మోసం చేసే దృష్టితోనే దగ్గుబాటి వెంకీ రాజీనామా చేశాడు కానీ ఆయన భార్య మాత్రం మంత్రి పదవి వదులుకోదు.   కాటికి కాళ్ళు చాచిన కావూరి మంత్రి పదవి తీసుకొని సి డబ్ల్యు సి కి రాజీనామా చేసినపుడే నాకు అనుమానం వచ్చింది. ఆంధ్ర  ప్రాంత ఏమ్పీలందరికీ ముందే తెలుసు రాష్ట్రం విడిపోనున్నదని.   ఈ విషయం ముందుగా తెలిసీ,    ఇంకా మోసం చెయ్యాలని చూసే వాళ్ళను ప్రజలు క్షమించినా, ఆ ముక్కంటి మాత్రం క్షమించడు.    

అట్టుడుకుతున్న రాయలసీమ


విభజన కొందరికి ఖేదాన్ని మిగిలిస్తే, కొదరికి తీవ్ర మోదాన్ని మిగిల్చింది.   అత్యంత వెనుకబడిన రాయలసీమ లోని కొన్ని ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.    రాజస్థాన్ ఎడారి తరువాత అత్యల్ప వర్షాభావ ప్రాంతంగా అనంతపురం గుర్తింపబడింది.    కనీసం రెండు జిల్లాలతో కూడిన రాయల తెలంగాణాగా విభాజించినట్లయితే,  కొంత మేర వారికి మేలు జరిగి వుండేది. అదనంగా నీళ్ళు రాకపోయినా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికేవి.  


కర్నూల్ రాజధానికి తీర ప్రాంత వాసులు ఒప్పుకోరు.   కారణం, శ్రీకాకుళం నుంచి వున్న తీర ప్రాంతానికి పాలనా పరంగా అనుకూలత వుండదు.   రాయలసీమ వాసులు అడుగుతున్న నెల్లూరు, ప్రకాశం (3 రెవిన్యూ డివిజన్లు) తో కూడిన రాష్ట్రానికి నెల్లూరు వాసులు అంగీకరించరు.   కేవలం నాలుగు జిల్లాలతో కూడిన రాయలసీమ మనుగడ సాగించడం కష్టం.    ఇలాంటి నాలుగు జిల్లాల రాయలసీమ డిమాండ్కు కాదనే హక్కు తీర ప్రాంత వాసులకు కూడా లేదు.     ఏదో రకంగా సర్దిచెప్పుకొని 13 జిల్లాల ఆంద్ర ప్రదేశ్ ఆవిర్భవించినా, భావిష్యతులో రాయలసీమ డిమాండ్ తెరమీదకు రాదన్న నమ్మకం లేదు.  


చట్టబద్ధమైన విభజనకు (పార్లమెంటులో బిల్లు పెట్టే ముందరే) ముందే ఈ విషయాన్ని మదింపు చేయకుంటే, భవిష్యతులో తమ రాజకీయ అవసరాల కోసమో, పదవి కోసమో ఉద్రేకాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవచ్చు.   నిన్న ఆంద్ర జ్యోతి వ్యాసంలో గౌరవ పార్లమెంటు సభ్యుడు రాసినట్లు, మీ పుల్లట్లు మాకు రుచి చూపించ లేదు, మా బోనాలు మీరు ఎత్తుకోలేదు. కాబట్టే రాష్ట్రం కావాలన్నామని చెప్పారు. రాబోయే రోజులలో రాయలసీమ నాయకులు నిందించవచ్చు - మా ప్రాంతంతో మీరు మమైకం కాలేక పోయారు.    మా ప్రాంతంలోని దేవర కద్రలో పెద్ద పండుగ జరుగుతుంది, దేవుళ్ళని ఒక వూరి నుండి ఇంకొక వూరికి తీసుకొనే ప్రయత్నంలో రక్తం చిన్దిస్తాము, తీర ప్రాంత వాసులు ఎన్నిసార్లు ఇందులో పాల్గొని రక్తం చిందిచారు? అని అడగవచ్చు.   లేదా మేము రాగి ముద్ద, ఉల్లిపాయ ఖారం తింటాము, మీరు ఎప్పుడైనా తిన్నారా, మీ జల పుష్పాలు మాకు ఎప్పుడూ పెట్ట లేదు,   కాబట్టి మాది మాకు కావాలి, అవసరమైతే మా బిడ్డలు (సొంత పిల్లలు కాదని మనవి) ఆత్మబలిదానాలకు సిద్ధంగా వున్నారు అని రెచ్చగొట్టే ప్రమాదం వుంది.  


సమైక్యం కాని పక్షంలో, రాయల తెలంగాణా ప్రతిపాదన బహుశా తెలంగాణా, తీర, సీమంధ్రులలో మెజారిటీ ప్రజలు ఒప్పుకొని వుండే వారు.   విభజన ప్రకటనకు ముందు,  రాజకీయేతర క్షాలకు చెందిన అన్ని ప్రాంత  మేధావులతో  కేంద్రం చర్చించి వుంటే, భవిష్యత్ తరాల తెలుగు వాడికి ఇబ్బంది వుండేది కాదు.   తెలుగు జాతిలో పుట్టిన ఈ ముసలానికి శాశ్వత పరిష్కారం కష్టమే!